ఫిబ్రవరి 28న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సమావేశంలో ఈపీఎఫ్ఓ 2024-25 సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్ల వడ్డీ రేటును మునుపటి సంవత్సరం 8.25 శాతం దగ్గర కొనసాగించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 2023-24 సంవత్సరానికి ఈపీఎఫ్ఓ రూ.13 లక్షల కోట్ల ప్రిన్సిపల్ నుంచి రూ.1,07,000 కోట్ల ఆదాయంపై 8.25 శాతం వడ్డీని అందించింది. 2022-23లో రూ.11.02 లక్షల కోట్ల ప్రిన్సిపల్ నుంచి రూ.91,151.66 కోట్ల ఆదాయంపై 8.15 శాతం మాత్రమే వడ్డీను అందించింది. పలు నివేదికల ప్రకారం ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఈపీఎఫ్ఓ సూచించిన వడ్డీ రేట్లను సీబీటీను ఆమోదించి, అధికారికంగా ప్రకటించి చందాదారుల ఖాతాలకు జమ చేయాల్సి ఉంటుంది.
ఈపీఎఫ్ఓకు సంబంధించిన అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన సీబీటీ, కార్మిక, ఉపాధి మంత్రి నేతృత్వంలో ఉంటుంది. కంపెనీలకు సంబంధించిన యజమానులు, ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వాలు, కార్మిక మంత్రిత్వ శాఖ, ఈపీఎఫ్ఓ నుంచి సీనియర్ అధికారుల ప్రతినిధులు ఈ సీబీటీ బృందంలో ఉంటారు. వడ్డీ రేటును నిర్ణయించే ముందు ఈపీఎఫ్ఓ ఆర్థిక పనితీరును అంచనా వేయడానికి ఈ బృందం వచ్చే వారం సమావేశం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆకస్మిక పరిస్థితులకు తగినంత మిగులు నిధులను నిర్ధారించడం ఈ బృందం లక్ష్యం. ఈ సంవత్సరం పెట్టుబడులపై రాబడి, చందాదారుల పెరుగుదల పెరిగినప్పటికీ, క్లెయిమ్ సెటిల్మెంట్లలో గణనీయమైన పెరుగుదల ఉందని ఈపీఎఫ్ఓ అధికారులు చెబుతున్నారు.
2024-25లో ఈపీఎఫ్ఓ మొత్తం రూ.2.05 లక్షల కోట్ల విలువైన 50.8 మిలియన్లకు పైగా క్లెయిమ్లను నిర్వహించిందని గణాంకాల బట్టి తెలుస్తుంది. అలాగే 2023-24లో రూ.1.82 లక్షల కోట్ల విలువైన 44.5 మిలియన్ల క్లెయిమ్ల నుంచి పెరిగిందని నిపుణులు వివరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈపీఎఫ్ఓ మళ్లీ వడ్డీ రేటు యథాతధంగా ఉంచుతుందనే అంచనాలు సగటు ఉద్యోగికి ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ద్వారా 65 మిలియన్లకు పైగా చందాదారులకు సేవలు అందుతున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి