
ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్. రైల్వేశాఖ సూపర్ న్యూస్ అందించనుంది. ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ రైళ్లను నడిపేందుకు కసరత్తులు చేస్తోంది. విజయవాడ డివిజన్ మీదుగా ఏపీలో తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. దేశంలో తొలి స్లీపర్ రైలును ఈ ఏడాది జనవరిలో హౌరా-గువహతి మధ్య రైల్వేశాఖ ప్రవేశపెట్టింది. ప్రధాని మోదీ స్వయంగా దీనిని పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ప్రస్తుతం ఏపీ మీదుగా సాధారణ వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం, తిరుపతి వరకు, కాచిగూడ నుంచి బెంగళూరు, నర్సాపురం నుంచి చెన్నైకు రైళ్లు నడుస్తున్నాయి. అయితే స్లీపర్ రైళ్లు లేకపోవడంతో ఇప్పుడు వాటిని కూడా తీసుకొచ్చేందుకు రైల్వేశాఖ ప్రయత్నాలు చేస్తోంది.
దసరా నాటికి విజయవాడ మీదుగా వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి తీసుకురావాలని రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. విశాఖపట్నం నుంచి బెంగళూరు, విజయవాడ నుంచి బెంగళూరు మధ్య ఈ రైళ్లను నడిపేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇక విజయవాడ నుంచి అయోధ్య, విజయవాడ నుంచి ఢిల్లీకి నడిపితే బాగుంటుందని మరికొంతమంది ప్రతిపాదిస్తున్నారు. దీంతో ఏ రూట్లో అనేది క్లారిటీ లేనప్పటికీ.. దసరా నాటికి ఏపీలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కనుందని తెలుస్తోంది. వందే భారత్ స్లీపర్ రైళ్లల్లో అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. మెరుగైన కుషనింగ్, లేటెస్ట్ ఇంటీరియల్స్, ఇంటర్నెట్, ఛార్జింగ్ పాయింట్లు, ఆటోమేటిక్ డోర్లు, ఎల్ఈడీ డోర్లు, ఎల్ఈడీ లైట్లు, సౌండ్ ప్రూఫ్, ప్రత్యేక సెన్సార్లు వంటివి ఉన్నాయి. విమానం తరహాలోనే అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి.
వందే భారత్ స్లీపర్ రైళ్లు గంటకు 160 నుంచి 180 కిలోమీర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏసీ బోగీలు ఉంటాయి. ఇప్పటికే ప్రారంభమైన హౌరా-గువహతి తొలి వందే భారత్ స్లీపర్ రైలులో మొత్తం 16 కోచ్లు ఉన్నాయి. ఈ ట్రైన్లో కనీస ఛార్జి రూ.960 నుంచి ప్రారంభమవుతుంది. అయితే స్లీపర్ రైళ్లల్లో ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్ వంటివి ఉండవు. కన్ఫార్మ్డ్ టికెట్ ఉన్నవారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు. వీటిల్లో సౌండ్ ప్రూఫ్ సిస్టమ్ ఉండటంతో ఎలాంటి సౌండ్స్, కుదుపులు అనేవి ఉండవు. దీంతో రాత్రి సమయంలో ప్రశాంతంగా ప్రయాణం చేయవచ్చు. అటు సికింద్రాబాద్-ఢిల్లీ రూట్లో కూడా వందే భారత్ స్లీపర్ రైలు తీసుకురావాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రయత్నాలు చేస్తోంది.