Ayushman Vay Vandana Card: రూ.5 లక్షల వరకు ఆస్పత్రుల్లో ఉచిత ట్రీట్మెంట్.. వీరికి కేంద్రం నుంచి అదిరిపోయే స్కీమ్.. దరఖాస్తు ఎలా..?
సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారి ఆరోగ్య సంరక్షణ కోసం ఓ స్కీమ్ను తీసుకొచ్చింది. అదే వయ వందన కార్డ్. ఈ కార్డ్ ద్వారా వృద్దులు రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం పొందవచ్చు.

దేశంలోని వృద్దుల ఆరోగ్యం కోసం ఆయుష్మాన్ వయ వందన కార్డును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్దులందరికీ దీని ద్వారా ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స పొందవచ్చు. వారి ఆదాయంతో సంబంధం లేకుండా ఈ ప్రయోజనం పొందవచ్చు. ఆయుష్మాన్ భారత్ పథకానికి కొనసాగింపుగా కుటుంబంలోని వృద్దుల కోసం కేంద్రం ఈ స్కీమ్ తీసుకొచ్చింది. సీనియర్ సిటిజన్లతో పాటు వారి కుటుంబాల ఇది పెద్ద ఉపశమనంగా చెప్పవచ్చు. వయస్సుతో పాటు అనారోగ్యాల బారిన పడటం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య చికిత్సకు లక్షలకు లక్షలు ఖర్చు అవుతుంది. సామాన్యులకు ఇది భారంతో కూడుకున్న వ్యవహారం. దీంతో కేంద్రం ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.
వయ వందన కార్డ్ అంటే..?
ఆయుష్మాన్ వయ వందన కార్డ్ ద్వారా ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.5 లక్షల వరకు ఉచిత ట్రీట్మెంట్ పొందవచ్చు. 70 ఏళ్లు పైబడ్డ ప్రతీ సీనియర్ సిటిజన్కు ఈ స్కీమ్ వర్తిస్తుంది. ప్రతి వ్యక్తి రూ.5 లక్షల వరకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ పొందే సౌకర్యాన్ని కల్పిస్తోంది. డబ్బు లేకపోవడం వల్ల సీనియర్ సిటిజన్లు ఆరోగ్య సేవలను కోల్పోకూడదనే కారణంతో వయ వందన కార్డ్ ప్రవేశపెట్టారు. ఆయుష్మాన్ భారత్ నమోదు కేంద్రాలు లేదా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని ఈ కార్డును వృద్దులు పొందవచ్చు.
వీటికి కవరేజీ
సర్జరీలు, టెస్టులు, మందులు, ఆస్పత్రులో చేరడానికి లేదా ముందు అయిన ఖర్చులకు ఈ కార్డుతొ కవరేజీ లభిస్తుంది. ఎంప్యానెల్డ్ ఆస్పత్రుల్లో క్యాష్ లెట్ ట్రీట్ మెంట్ సుదుపాయం అమల్లో ఉంటుంది. దీని వల్ల ముందు డబ్బులు చెల్లించి ఆ తర్వాత క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అత్యవసర వైద్య సహాయం సమయంలో ఇది ఉపయోగపడుతుంది. దీంతో సీనియర్ సిటిజన్లకు ఈ కార్డు భద్రత కల్పించడంతో పాటు సకాలంలో వైద్య చికిత్స పొందేందుకు సహాయపడుతుంది. ఇప్పటికే ప్రైవేట్ బీమా పాలసీలు ఉన్నా.. వయ వందన కార్డు పొందవచ్చు. ఎంప్యానెల్డ్ ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఈ కార్డు ద్వారా రూ.5 లక్షల వరకు ఉచిత ట్రీట్ మెంట్ పొందవచ్చు. అయితే ప్రస్తుతం అయుష్మాన్ భారత్ కార్డు ద్వారా ప్రతీ కుటుంబం రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స పొందవచ్చు. దానితో సంబంధం లేకుండా ప్రత్యేకంగా వృద్దులు ఈ రూ.5 లక్షలు ఉపయోగించుకోవచ్చు. ఇది వృద్దులకు మంచి అవకాశంగా చెప్పవచ్చు.
