EPFO: మారిన రూల్స్.. 2026లో రిటైర్ అయ్యే ప్రైవేట్ ఉద్యోగులకు పెన్షన్ ఎంత వస్తుందంటే..?
ప్రైవేట్ రంగ ఉద్యోగులకు రిటైర్మెంట్ అనగానే పెన్షన్ ఆందోళన సహజం. అయితే, EPFO EPS పథకం వారికి గొప్ప భరోసా ఇస్తుంది. ఈ పథకం కింద కనీసం 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులు 58 ఏళ్ల వయస్సులో పెన్షన్ పొందవచ్చు.

ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు రిటైర్మెంట్ ఆలోచన ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల మాదిరిగా వారికి స్థిరమైన పెన్షన్ విధానం ఉండదు. కాబట్టి వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత గురించి భయపడటం సహజం. అయితే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో సభ్యులుగా ఉంటే మీకు అలాంటి ఆందోళన పెద్దగా అక్కర్లేదు. EPFO EPS పథకం ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఒక భరోసా ఇస్తోంది. మీరు 2026లో రిటైర్ అవుతుంటే మీకు ప్రతి నెలా పెన్షన్ వస్తుంది. మరి అది ఎంత వస్తుందనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
PF కటింగ్లో కొంత భాగం పెన్షన్ కోసం పొదుపు అవుతుంది. రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగికి ప్రతి నెలా పెన్షన్ ఇచ్చేందుకు ఈ ఏర్పాటు చేశారు. అయితే పెన్షన్ ప్రయోజనాన్ని పొందడానికి కొన్ని షరతులు ఉన్నాయి. పెన్షన్కు అర్హత పొందాలంటే ఒక ఉద్యోగి కనీసం 10 సంవత్సరాల సర్వీస్ (పెన్షనబుల్ సర్వీస్) పూర్తి చేసి ఉండాలి. సాధారణంగా పూర్తి పెన్షన్ 58 సంవత్సరాల వయస్సులో లభిస్తుంది.
పెన్షన్ లెక్కింపు..
EPFO ఏర్పాటు చేసిన సాధారణ సూత్రాన్ని ఉపయోగించి మీరు దానిని మీరే లెక్కించవచ్చు. (పెన్షన్ జీతం × మొత్తం సర్వీస్ సంవత్సరాలు) / 70. EPFO నిబంధనల ప్రకారం మీ పెన్షన్ (ప్రాథమిక జీతం + DA) లెక్కించడానికి గరిష్ట జీతం పరిమితి నెలకు రూ.15,000గా నిర్ణయించబడింది. దీని అర్థం మీ ప్రాథమిక జీతం లక్షల్లో ఉన్నప్పటికీ, మీ పెన్షన్ రూ.15,000 ఆధారంగా లెక్కించబడుతుంది. ఇక్కడ సర్వీస్ సంవత్సరాలు అనేది మీరు మీ EPS ఖాతాకు ఎన్ని సంవత్సరాలు కొనసాగించారో సూచిస్తుంది.
2026లో రిటైర్ అయితే..
కిషోర్ అనే ఉద్యోగి 2026లో రిటైర్ అవుతుంటే.. ఆ సమయానికి అతని మొత్తం సర్వీస్ లేదా EPS కి సహకార కాలం 50 సంవత్సరాలు అని అనుకుందాం. పెన్షన్ గణన కోసం గరిష్ట జీతం పరిమితి రూ.15,000 గా నిర్ణయించబడినందున, కిషోర్ పెన్షన్ ఈ క్రింది విధంగా లెక్కించబడుతుంది: 15,000 (జీతం) × 50 (సంవత్సరాలు) ÷ 70 = రూ.10,714 (సుమారుగా). దీని ప్రకారం కిషోర్ పదవీ విరమణ తర్వాత నెలకు సుమారు రూ.10,714 పెన్షన్ పొందుతారు. అయితే వయస్సు కూడా ఇక్కడ పాత్ర పోషిస్తుంది. కిషోర్ 58 ఏళ్లు వచ్చే వరకు వేచి ఉండకపోతే, 50 ఏళ్ల వయసులో పెన్షన్ పొందడం ప్రారంభించినట్లయితే, అతను నష్టపోతాడు. నిబంధనల ప్రకారం అతను ప్రతి సంవత్సరం 4 శాతం తక్కువ పెన్షన్ పొందుతాడు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
