నిత్యం రహదారులపై అనేక కంపెనీల కార్లు మనకు దర్శనమిస్తున్నాయి. ఆకట్టుకునే రంగులతో, వివిధ ప్రత్యేకతలతో అబ్బుర పరుస్తాయి. రోడ్లపై రయ్ మని దూసుకుపోతూ సందడి చేస్తున్నాయి. మారుతీ, టాటా, మహీంద్రా, హ్యందాయ్ ఇలా అనేక కంపెనీల నుంచి పలు కార్లు మార్కెట్ లోకి విడుదలవుతున్నాయి. వీటిలో కొన్ని ప్రజాదరణ పొంది అమ్మకాలలో ముందుంటున్నాయి. లుక్, సామర్థ్యం, పనితీరు తదితర వాటిలో తమ ప్రత్యేకతలతో ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో జూలై లో హ్యుందాయ్ క్రెటా తన ప్రత్యేకతను నిలుపుకొంది. అత్యధికంగా అమ్ముడైన కార్లలో నంబర్ వన్ గా నిలిచింది. మారుతి సుజుకి స్విఫ్ట్, టాటా పంచ్, మహీంద్రా స్కార్పియో తదితర వాటిని వెనక్కు నెట్టి హ్యుందాయ్ క్రెటా దూసుకుపోయింది. జూలై నెలలో టేబుల్ టాప్ కారుగా నిలిచింది. 2024 జూలైలో అత్యధికంగా అమ్ముడైన కారుగా రికార్డు సాధించింది. ఆ నెలలో అమ్ముడైన టాప్ టెన్ కార్లను పరిశీలిస్తే. . వాటిలో మారుతీ సుజుకి ఇండియా నుంచి ఆరు మోడళ్లు, టాటా మోటార్స్ నుంచి రెండు, హ్యుందాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా & మహీంద్రా నుండి ఒక్కొక్కటి ఉన్నాయి.
అధికారిక లెక్కల ప్రకారం.. 2024 జూలై లో 17,350 హ్యుందాయ్ క్రెటా యూనిట్ల అమ్మకాలు జరిగాయి. దీంతో ఈ కారు టాప్ లో నిలిచింది. తర్వాత మారుతి సుజుకి స్విఫ్ట్ ఉంది. ఈ కారు యూనిట్లు 16,854 విక్రయించారు. 16,191 యూనిట్లతో మారుతీ సుజుకి వ్యాగన్ఆర్ మూడో స్థానం సాధించింది. టాటా పంచ్ కు సంబంధించి 16,121 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత మారుతి సుజుకి ఎర్టిగా 15,701, మారుతి సుజుకి బ్రెజ్జా 14,676 యూనిట్ల వద్ద నిలిచాయి. టాటా నెక్సాన్ దాని వాల్యూమ్లను 13,902 యూనిట్లకు మెరుగుపరిచింది. మహీంద్రా స్కార్పియో (ఎన్ మరియు క్లాసిక్తో సహా) 12,237 యూనిట్ల అమ్మకాలతో పరుగులు తీసింది. మారుతి సుజుకి ఈకో 11,916, మారుతి సుజుకి డిజైర్ 11,647 యూనిట్ల విక్రయాలతో తొమ్మిది, పదో స్థానాలలో నిలిచాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..