Central Government: కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం.. మహిళల అకౌంట్లోకి డబ్బులు.. వీరందరికీ పండుగే..
త్వరలో మహిళల కోసం కేంద్రం కొత్త పథకం మొదలుపెట్టనుంది. గతంలో ఉన్న స్టాండప్ ఇండియా పథకాన్ని తిరిగి ప్రారంభించనుంది. ఆ పథకం స్థానంలో కొత్త స్కీమ్ తీసుకురానుంది. త్వరలోనే దీనిని తీసుకురానున్నట్లు కేంద్రం ప్రకటించింది. వీటి వివరాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం త్వరలో మరో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. వ్యాపారం స్టార్ట్ చేయాలనుకునే మహిళలను ప్రోత్సహించేందుకు కొత్త స్కీమ్ను మొదలుపెట్టనుంది. ఈ విషయాన్ని లోక్సభలో ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వ్యాపారంలో రాణించాలనుకునే మహిళలకు రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు అత్యల్ప వడ్డీ రేటుకు రుణాలు అందించనున్నట్లు స్పష్టం చేసింది. కేవలం ఎస్సీ,ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలకు ఈ సదుపాయం కల్పించనుంది. ఈ లోన్ చెల్లించేందుకు ఏడేళ్ల కాలపరిమితి, 18 నెలల మారటోరియం అవకాశం ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లోని మహిళలు ఈ పథకం ద్వారా లబ్ది పొందవచ్చు.
స్టాండప్ ఇండియా పథకం
2016లో కేంద్ర ప్రభుత్వం స్టాండ్-అప్ ఇండియా పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా కొత్త కంపెనీ స్టార్ట్ చేయాలనుకునే మహిళలకు బ్యాంకు రుణాలను అందిస్తోంది. SC, ST మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం గడువు మార్చి 31,2025తో ముగిసింది. ఈ పథకం స్థానంలో ఇప్పుడు కొత్త స్కీమ్ను తీసుకొస్తున్నట్లు నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. లోక్సభలో స్టాండప్ ఇండియా పథకంపై లోక్సభలో అడిగిన ఓ ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆ పథకం స్థానంలో కొత్త స్కీమ్ త్వరలో తీసుకురానున్నట్లు తెలిపారు. స్టాండప్ ఇండియా పథకం ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకున్నామని, వాటిని అధ్యయనం చేసి మహిళలకు లబ్ది చేకూర్చేలా కొత్త పథకం ప్రవేశపెడతామని తెలిపారు. నీతి అయోగ్, ఇతరులు చేసిన అధ్యయనంతో పథకాన్ని తిరిగి ప్రారంభిస్తున్నామని, త్వరలో కేబినెట్ ఆమోదానికి వెళ్తుందన్నారు.
గ్రామీణ ప్రాంతాల మహిళల కోసం..
కేబినెట్ ఆమోదం తర్వాత దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రయోజనం చేకూర్చేందుకు కొత్త పథకాన్ని ప్రారంభిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇక ఈ పథకం కింద ఇచ్చే రుణం మొత్తాన్ని పెంచుతారా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ఇందుకోసం వివిధ ఆఫ్షన్లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. స్టాండప్ కింద కేవలం గ్రీన్ ఫీల్డ్ కంపెనీలకు మాత్రమే రుణాలు ఇస్తుండగా.. కొత్త పథకంలో వేరే ప్రాజెక్టులకు కూడా రుణం మంజూరు చేయనున్నారు. అటు గ్రామీణ మహిళల కోసం పీఎం ముద్రా , సీడ్బీ ఫైనాన్సింగ్ పథకాలు ఉన్నాయి. స్టాండప్ పథకం అనేది కేవలం పట్టణ ప్రాంతాల మహిళలకు సంబంధించినదిగా చెప్పవచ్చు.
