Toll Charges: కేంద్రం షాకింగ్ డెసిషన్.. ఈ వాహనాలకు కూడా టోల్ చెల్లించాల్సిందే..! కొత్త రూల్స్..
కేంద్ర ప్రభుత్వం టోల్ వ్యవస్థలో మరో మార్పుకు నాంది పలికేందుకు సిద్దమవుతోంది. అదేంటంటే.. ప్రస్తుతం కొన్ని వాహనాలకు టోల్ చెల్లింపుల్లో మినహాయింపులు ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు, పారామిలిటరీ లాంటి విభాగాల్లో పనిచేసేవారి వాహనాలకు టోల్ మినహాయింపులు ఉన్నాయి. రానున్న రోజుల్లో వీరికి తొలగించనున్నారు.

టోల్ చెల్లింపు వ్యవస్థలో కీలక సంస్కరణలకు గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. టోల్ వ్యవస్థలో పారదర్శకత తెచ్చేందుకు అనేక మార్పులు చేస్తోంది. ఈ క్రమంలో కేంద్రం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం కొంతమంది వీఐపీలు, వీవీఐపీలకు టోల్ చెల్లింపుల్లో మినహాయింపులు ఇస్తోన్న విషయం తెలిసిందే. వీటి సంఖ్యను తగ్గించాలని కేంద్రం చూస్తోంది. ప్రస్తుతం ఇది ప్రతిపాదనల దశలో ఉండగా.. ప్రభుత్వం వివిధ భాగస్వాముల అభిప్రాయాలను సేకరిస్తోంది. అనంతరం తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. భవిష్యత్తులో దీని గురించి అధికారిక ప్రకటన రావొచ్చని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ వాహనాలకు టోల్ లేదు
ప్రస్తుతం 25 పదవుల్లో ఉన్న వ్యక్తులకు చెందిన వాహనాలకు టోల్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే రక్షణ దళాలు, పారామిలిటరీ దళాలు, అగ్నిమాపక విభాగాలు, అంబులెన్సులు, రహదారి తనిఖీ బృందాలు, శవపేటిక వాహనాలు వంటి అనేక సేవలకు కూడా మినహాయింపు అమల్లో ఉంది. ఇటువంటి వెహికల్స్కు మినహాయింపు పొందిన ఫాస్టాగ్ జారీ చేస్తారు. ఈ ఫాస్టాగ్ తప్పనిసరిగా వెహికల్కు ఉంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడే టోల్ ఛార్జీల నుంచి మినహాయింపు లభిస్తుంది. చెల్లుబాటు అయ్యే ఫాస్టాగ్ ఉంచుకోవాలి.
మార్పులు ఎందుకు..?
దశలవారీగా టోల్ మినహాయింపులను తొలగించాలని కేంద్రం చూస్తోంది. తొలుత కొంతమంది ప్రభుత్వం అధికారులకు చెందిన వాహనాలకు తొలగించనున్నారు. దీనిపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోంది. ఒకేసారి కాకుండా దశలవారీగా తొలగింపు అమలు చేయనున్నారు. టోల్ మినహాయింపు నిబంధలను ఇటీవల ఒక ఉన్నతస్థాయి కమిటీ సమీక్షించింది. అనంతరం పలు కీలక సిఫార్సులు చేసింది. మినహాయింపుల నుంచి కొంతమందిని తొలగించడంతో పాటు రుసుం నిబంధనల్లో మార్పులు చేయాలని సూచించింది. టోల్ మినహాయింపులు అధికారులకు తొలగించడం వల్ల వీఐసీ సంస్కృతిపై ప్రజల్లో అసంతృత్తి కూడా తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది. నిబంధనలు అందరికీ సమానమని ప్రజలు భావించేలా చేయనుంది. దీని వల్ల సామాన్య పౌరులకు సంతృప్తి కలిగించడంతో పాటు టోల్ చెల్లింపుల్లో పారదర్శకత లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. కాగా ప్రభుత్వ అధికారులకు చెందిన వాహనాలకు కూడా ఫాస్టాగ్ వార్షిక పాస్ తీసుకోవాలని ఇప్పటికే నిబంధన పెట్టారు. రానున్న రోజుల్లో ఇతర శాఖల అధికారులకు కూడా దీనిని వర్తింపచేయనున్నారు. కాగా టోల్ ఛార్జీ చెల్లించకుండా వెళ్లిన వాహనాలకు జరిమానా విధించనున్నారు. ముందుగా ఎలక్ట్రానిక్ పద్దతిలో నోటీసులు జారీ చేస్తారు. గడువులోగా చెల్లించకపోతే జరిమానా విధించనున్నారు.
