Rent Rules: అద్దె ఇళ్లల్లో ఉంటున్నవారికి కొత్త రూల్స్.. అద్దె పెంచాలంటే ఆ పని చేయాల్సిందే.. కేంద్ర నిబంధనలు ఇవే..
కేంద్ర ప్రభుత్వం కొత్త అద్దె నియమాలను ప్రవేశపెట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధి, విద్య కోసం లక్షలాది మంది పల్లెటూర్ల నుంచి నగరాలు, పట్టణాలకు వచ్చి జీవనం కొనసాగిస్తున్నారు. వీళ్లు ఎక్కువగా అద్దె ఇళ్లల్లోనే ఉంటున్నారు. దీంతో అద్దె ఇళ్లల్లో ఉంటున్నవారికి రక్షణ కల్పించేందుకు కేంద్రం రూల్స్ తీసుకొచ్చింది.

అద్దె ఇళ్లల్లో ఉండేవారికి కేంద్ర ప్రభుత్వం బిగ్ రిలీఫ్ అందించింది. అద్దె రూల్స్లో కీలక మార్పులు అమల్లోకి తెచ్చింది. అద్దె ఇళ్లల్లో ఉండేవారికి ఈ నిబంధనల వల్ల ఎంతో ప్రయోజనం కలగనుంది. కేంద్రం 2026 సంవత్సరానికి సంబంధించి కొత్త అద్దె నియమాలను ప్రవేశపెట్టింది. అద్దె ఇళ్లల్లో ఉండేవారందరూ వీటి గురించి తెలుసుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. పట్టణాలు, నగరాల్లో లక్షల మంది అద్దె ఇళ్లల్లో ఉంటూ ఉంటారు. అద్దె ఇళ్లల్లో ఉండేవారికి రక్షణ కల్పించేందుకు వీటిని కేంద్రం కొత్తగా తీసుకొచ్చింది. అద్దెకు ఇచ్చేటప్పుడు యజమానులు చట్టపరంగా ఏం చేయాలి..? అద్దె ఎప్పుడు పెంచాలి..? అడ్వాన్స్ ఎంత తీసుకోవాలి? అనే విషయాలను కొత్త రూల్స్లో పొందుపర్చారు. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
60 రోజుల్లోపు ఒప్పందం చేసుకోవాలి
అద్దె ఇళ్లల్లో ఉండేవారు తప్పనిసరిగా 60 రోజుల్లోపు యజమానితో అగ్రిమెంట్ చేసుకోవాలి. ఆన్లైన్లో అగ్రిమెంట్స్ను నమోదు చేయాలి. 60 రోజుల్లో చేయకపోతే రూ.5 వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇక నకిలీ ఒప్పందాలు, చట్టవిరుద్దమైన తొలగింపులను నిరోధించడానికి కేంద్రం ఈ నిబంధన తెచ్చింది. ఇక మౌఖిక ఒప్పందాలు చట్టపరంగా చెల్లవు.
2 నెలల అడ్వాన్స్ మాత్రమే..
ఇక ఇంటి యజమాని కేవలం రెండు నెలల అడ్వాన్స్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక వాణిజ్య అవసరాల కోసం అద్దెకు ఇస్తుంటే 6 నెలల అద్దె ముందుగా తీసుకోవచ్చు. కొంతమంది యజమానులు 10 నెలలు లేదా సంవత్సరం అద్దెను ముందుగానే తీసుకుంటూ ఉంటారు. అలాంటివి చట్ట విరుద్దం.
సంవత్సరానికి ఒకసారి మాత్రమే..
ఇక నుంచి ఎప్పుడు పడితే అప్పుడు అద్దె పెంచడానికి వీల్లేదు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే అద్దెను పెంచాల్సి ఉంటుంది. అయితే అద్దెను పెంచడానికి మూడు నెలల ముందుగానే దీని గురించి యజమాని సమాచారం అందించాల్సి ఉంటుంది. ఇక అద్దె చెల్లించకపోవడం, ఆస్తికి నష్టం చేకూర్చడం లాంటివి అద్దెదారుడు చేస్తే ట్రిబ్యూనల్లో యజమాని ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఎలాంటి చట్టపరమైన నోటీసులు లేకుండా అద్దెదారుడిని ఖాళీ చేయించడం లేదా తాళం వేయిడం లాంటివి చేయకూడదు. అలాంటి పనులు యజమాని చేస్తే అద్దెదారుడు చట్టపరంగా ఫిర్యాదు చేయవచ్చు. ఇక యజమాని ఇంటికి కరెంట్ కట్ చేయడం, వాటర్ బంద్ చేయడం లాంటివి చేస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయి. ఇలా అద్దెదారుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రం కొత్త అద్దె నియమాలను తీసుకొచ్చింది. అద్దె ఇంట్లో నివసిస్తున్నవారికి ఇది భద్రతను కల్పిస్తాయి. కాగా నగరాల్లో అద్దె ఇళ్లల్లో ఉండేవారు ఎక్కువగా ఉంటారు. కొంతమందికి వీటి గురించి ఎలాంటి అవగాహన ఉండదు.
