Hyderabad: హైదరాబాద్లో నివాసం ఉంటున్నవారికి కేంద్రం ఎగిరి గంతేసే వార్త.. పండుగ చేస్కోండి
హైరదాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి హెచ్ఆర్ఏ పరిమితి పొందేందుకు మెట్రో నగరాల జాబితాలో హైదరాబాద్ను కూడా చేర్చింది.

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు ఊరట కలిగించేలా మరో కీలక ప్రకటన చేసింది. రానున్న కొత్త ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి కేంద్రం కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ను అమల్లోకి తీసుకురానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదించగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నోటిఫై చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి దీనిని అమలు చేయాలని నిర్ణయించగా.. ఇందులో భాగంగా కొత్త ఇన్ కమ్ ట్యాక్స్ రూల్స్ 2026 ప్రవేశపెట్టారు. ఈ నియమాలను కేంద్రం ఇప్పటికే నోటిఫై చేయగా.. త్వరలో వర్తింపచేయనున్నారు. ఈ రూల్స్లో భాగంగా కొత్త హౌస్ రెంట్ అలవెన్స్(HRA) పరిమితులు రానున్నాయి.
మెట్రో నగరాల జాబితాలో హైదరాబాద్
ఆదాయపు పన్ను చట్టం-1961 స్థానంలో కొత్త ఇన్కమ్ ట్యాక్స్ చట్టం 2025 అమల్లోకి రానుంది. ఈ చట్టంలో భాగంగా హౌస్ రెంట్ అలవెన్స్ పరిమితిని కేంద్రం 50 శాతానికి పెంచింది. గతంలో ఢిల్లీ, కోల్ కత్తా, చెన్నైలను మాత్రమే మెట్రో నగరాలుగా కేంద్రం పరిగణించి హెచ్ఆర్ఏ పరిమితి వర్తింపచేసేది. కానీ ఇప్పుడు ఈ జాబితాలో హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు నగరాలను కూడా కేంద్రం చేర్చుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా దీనిని నోటిఫై కూడా చేసింది. దీంతో ఇక నుంచి హైదరాబాద్, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్లలో నివసిస్తున్న ఉద్యోగులు కూడా హౌస్ రెంట్ అలవెన్స్లో 50 శాతం వరకు ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. ఇక మిగిలిన నగరాల్లో ఉంటున్నవారికి ఎప్పటిలాగే 40 శాతం పన్ను మినహాయింపు ఉంటుంది. 2027 జులైలో దాఖలు చేసే ఆదాయపు పన్ను రిటర్న్స్లో ఇది వర్తిస్తుంది.
కొత్త హెచ్ఆర్ఏ రూల్స్
కేంద్ర ప్రభుత్వం కొత్త హెచ్ఆర్ఏ రూల్స్ ప్రవేశపెట్టింది. ఈ రూల్స్ ప్రకారంలో నగరంలో అద్దె ఇళ్లల్లో ఉంటున్నవారు హెచ్ఆర్ఏ ట్యాక్స్ మినహాయింపులు పొందాలంటే తప్పనిసరిగా యాజమానితో ఉన్న సంబంధం గురించి వెల్లడించాలి. ఫారం 124లో ఈ వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. కొంతమంది తప్పు వివరాలతో హెచ్ఆర్ఏ పొందుతున్నారు. దీనిలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ఐటీ శాఖ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. పాత పన్ను విధానం ఎంచుకున్నవారికి మాత్రమే ఈ హెచ్ఆర్ఏ పన్ను మినహాయింపు పరిమితి వర్తిస్తుంది. కొత్త పన్ను విధానం ఎంచుకున్నవారికి ఇది వర్తించదు. కాగా గత ఏడాది ఆగస్ట్ 12వ తేదీన కేంద్రం కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించింది. ఇందులో చాప్టర్లను 47 నుంచి 23కు తగ్గించారు. ఇక గతంలో 819 సెక్షన్లు ఉండగా.. ఇప్పుడు 536కి తగ్గించారు.
