E-Shram: డెలివరీ బాయ్స్కు శుభవార్త.. ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదుతో బోలెడు లాభాలు
ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న టెక్నాలజీ యువతకు కొత్త ఉపాధి మార్గాలు తెస్తుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో డెలివరీ బాయ్స్లా ఉపాధి పొందే వారి సంఖ్య పెరుగుతుంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్, జొమాటో, స్విగ్గీ, ఓలా, ఊబర్ వంటి సంస్థల్లో పెద్ద ఎత్తున యువత ఉపాధి పొందుతున్నారు. వీరిని గిగ్ వర్కర్లు అని పిలుస్తారు. వీరు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ-శ్రమ్ పోర్టల్లో తమ పేరు నమోదు చేసుకుంటే నమ్మలేని లాభాలు పొందవచ్చని నిపునులు చెబుతున్నారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన కేంద్ర బడ్జెట్ 2025 ప్రసంగంలో గిగ్ వర్కర్లకు ప్రభుత్వం గుర్తింపు కార్డులను అందజేస్తుందని ప్రకటించారు. ముఖ్యంగా కోటి మంది గిగ్ కార్మికులకు ఈ-శ్రమ్ ప్లాట్ఫామ్లో నమోదు చేసుకుని గుర్తింపు కార్డులను పొందాలని స్పష్టం చేశారు. వీరికి ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం-జేఏవై) కింద ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలు అందిస్తామని ప్రకటించారు. 2020 సామాజిక భద్రత నియమావళి ప్రకారం గిగ్ వర్కర్ అంటే సాంప్రదాయ యజమాని-ఉద్యోగి సంబంధానికి వెలుపల పనిచేసే లేదా పరిహారం పొందే ఏ వ్యక్తి అయినా గిగ్ వర్కర్ కింద పేర్కొంటున్నారు. వీరు సాధారణంగా ఫ్రీలాన్స్ లేబర్, రైడ్-హెయిలింగ్ లేదా ఫుడ్ డెలివరీ వంటి ఆన్-డిమాండ్ వృత్తుల్లో పనిచేస్తారు.
ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజనతో లాభాలు
పీఎం-జేఏవైతో సెకండరీ, టెర్షియరీ ఆసుపత్రిలో ఓ కుటుంబానికి రూ.5 లక్షల వరకు వైద్య సేవలు పొందడానికి బీమా ఉంటుంది. ముఖ్యంగా ప్రతి రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ముందుగా ఉన్న వ్యాధులకు సైతం మొదటి రోజు నుండే బీమా కవర్ అవుతుంది. ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద రిజిస్టర్డ్ ఈ-శ్రమ్ సభ్యులు బీమా కవరేజీని ఉపయోగించుకోవడానికి అర్హత ఉంటుంది. అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక రక్షణ కల్పించే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఈ-శ్రమ్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. సంబంధిత వెబ్సైట్లో నమోదు చేయడానికి ఆధార్ నంబర్, ఆధార్-లింక్డ్ మొబైల్ నంబర్, సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ అవసరం అవుతుంది. ఆధార్-లింక్డ్ మొబైల్ ఫోన్ నంబర్ లేకపోతే దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా రాష్ట్ర సేవా కేంద్రంలో బయోమెట్రిక్ ప్రామాణీకరణను ఉపయోగించి నమోదు చేసుకోవచ్చు.
ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు ఇలా
- ఈ-శ్రమ్ పోర్టల్ అధికారిక వెబ్సైట్ను తనిఖీ చేయాలి.
- మీ ఆధార్ ఖాతాకు కనెక్ట్ చేసిన మీ సెల్ ఫోన్ నంబర్ను నమోదు చేసిన తర్వాత “సెండ్ ఓటీపీ” పై క్లిక్ చేయాలి.
- మీ ఆధార్ నంబర్ను అందించాలి. మీ మొబైల్ పరికరానికి డెలివరీ చేయబడిన ఓటీపీను నమోదు చేయాలి.
- స్క్రీన్పై వ్యక్తిగత సమాచారాన్ని తనిఖీ చేసి, ఆపై మీ చిరునామా, విద్యా నేపథ్యం, నామినీ సమాచారం, బ్యాంక్ సమాచారంతో నియమించిన ఫీల్డ్లను పూరించాలి. ఆపై చివరగా అప్లికేషన్ను సబ్మిట్ చేయాలి.
- నైపుణ్యం పేరు, వ్యాపార రకం, పని రకాన్ని ఎంచుకోవాలి. పూర్తయిన తర్వాత మీ ఈ-శ్రమ్ కార్డ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.








