Airtel Recharge Plan: ఎయిర్టెల్ సిమ్ వాడేవారికి బ్యాడ్న్యూస్.. ఆ బేసిక్ రీఛార్జ్ ప్లాన్ బంద్.. ఇకపై ఎక్కువ ఖర్చు పెట్టాల్సిందే..
తమ కస్టమర్లకు ఎయిర్టెల్ బిగ్ షాకిచ్చింది. బేసిక్ ప్లాన్ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని స్థానంలో రెండు కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఎయిర్టెల్ గత ఏడాది రీఛార్జ్ ధరలను పెంచింది. ఇప్పుడు మరోసారి ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో కస్టమర్లు షాక్ అవుతున్నారు.

ప్రముఖ టెలికాం రంగ సంస్థ అయిన ఎయిర్టెల్ తమ కస్టమర్లకు బిగ్ షాకిచ్చింది. ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఎయిర్టెల్ రూ.299 రీఛార్జ్ ప్లాన్ గురించి తెలిసిందే. ఇది బేసిక్ ప్లాన్. హై-స్పీడ్ ఇంటర్నెట్, అన్లిమిటెడ్ కాలింగ్, ఉచిత ఎస్ఎంఎస్లు వంటి సౌకర్యాలు ఉంటాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజుల పాటు ఉండేది. సామాన్యులు ఎక్కువమంది ఈ ప్లాన్ వాడుతూ ఉంటారు. అయితే తాజాగా ఈ ప్లాన్ను ఎయిర్టెల్ తొలగించింది. తమ వెబ్ సైట్, యాప్లో ఈ ప్లాన్ను రిమూవ్ చేసింది. గత ఏడాది ఈ ప్లాన్ ధరలను ఎయిర్టెల్ పెంచింది. అనంతరం ఏడాది తర్వాత ఈ ప్లాన్ను తొలగించడం హాట్టాపిక్గా మారింది.
కొత్త ప్లాన్ వచ్చేసింది..
రూ. 299 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తొలగించిన ఎయిర్టెల్.. దీని స్థానంలో ఇప్పుడు రూ. 349 ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఇది అనేక ప్రయోజనాలతో పాటు కొన్ని అదనపు ఆఫర్లను అందిస్తోంది. అయితే దీంతో పాటు రూ. 579, రూ. 619 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్లను కూడా నిలిపివేసినట్లు తెలుస్తోంది. అపరిమిత కాలింగ్, అపరిమిత డేటా ప్లాన్ను నిలిపివేసింది. రూ. 349 రీఛార్జ్ ప్లాన్ విషయానికొస్తే.. ఇది అన్లిమిటెడ్ లోకల్, STD కాల్స్, రోజుకు 2GB డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్లు అందిస్తోంది. దీని వ్యాలిడిటీ 28 రోజుల పాటు ఉంటుంది. అలాగే ఆరు నెలల పాటు ఉచితంగా ఆపిల్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్తో పాటు ఉచిత ఎయిర్టెల్ హెలోట్యూన్స్ సెట్ చేసుకోవచ్చు. అలాగే 12 నెలల అడోబ్ ఎక్స్ప్రెస్ ప్రీమియంను కూడా పొందవచ్చు. ఇక ఎయిర్టెల్ రూ. 399 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్ కూడా అందుబాటులో ఉంచింది. రోజుకు 2.5GB డేటా, 28 రోజుల జియోహాట్స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ పొందవచ్చు.
ఈ రెండు ప్లాన్లు కూడా బంద్..
ఇక ఎయిర్టెల్ తన రూ. 579, రూ. 619 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను కూడా నిలిపివేసినట్లు తెలుస్తోంది. యూపీ, ఉత్తరాఖండ్ సర్కిళ్లలో ఈ ప్లాన్లను నిలిపివేసింది. ఇతర సర్కిళ్ల నుండి కూడా ఈ రెండింటినీ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ తొలగించనుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ మార్పులను దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ కస్టమర్లు చూడవచ్చు. టెలికాం కంపెనీలు దేశవ్యాప్తంగా 5జీ విస్తరణ కోసం పోటీ పడుతున్నాయి. 5జీ సేవలను అన్ని పట్టణాల్లో ప్రారంభిస్తున్నాయి. దీంతో కంపెనీలకు ఎక్కువ ఖర్చు అవుతుంది. దీంతో ఈ భారాన్ని కస్టమర్లపై మోపుతున్నాయి. రీఛార్జ్ ధరలను పెంచుతూ వస్తోన్నాయి. తక్కువ ధర ప్లాన్లను తొలగిస్తున్నాయి. ఇక ఎయిర్టెల్తో పాటు ఇతర టెలికాం కంపెనీలు కూడా రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచుతున్నాయి.
