Konda Surekha: మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో కీలక పరిణామం.. అధిష్టానం కీలక నిర్ణయం!
తెలంగాణ కాంగ్రెస్లో గత వారం రోజులుగా మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆమె పార్టీ నియమాలను ఉల్లంఘించారనే ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన క్రమశిక్షణా కమిటీ విచారణ జరిపి పూర్తి నివేదికలను అధిష్టానంకు సమర్పించింది. అయితే దీనిని సీరియస్గా తీసుకున్న AICC కొండా సురేఖపై చర్యలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.

తెలంగాణ కాంగ్రెస్లో గత కొన్ని రోజులుగా నడుస్తున్న మంత్రి కొండా సురేఖ వ్యవహారం కొలిక్కి రానున్నట్టు తెలుస్తోంది. మంత్రి కొండా సురేఖ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై క్రమశిక్షణా చర్యలకు ఏఐసీసీ సిద్ధమవుతోన్నట్టు వర్గాల్లో చర్చ నడుస్తోంది. పార్టీ నియమావళి ఉల్లంఘనలు, అంతర్గత ఆరోపణల నేపథ్యంలో క్రమశిక్షణా కమిటీ సమర్పించిన నివేదికను అధిష్టానం సీరియస్గా పరిశీలిస్తోన్నట్టు తెలుస్తోంది. క్రమశిక్షణా కమిటీ నివేదికలో కొండా సురేఖ, చిన్నారెడ్డి పదవులు తొలగించాలని సూచించినట్లు సమాచారం.
అయితే కొండా సురేఖ పార్టీ నియమాలు ఉల్లంఘించడం ఇది తొలిసారి కాదని నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. అలాగే చిన్నారెడ్డి విషయంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి చేసిన ఫిర్యాదును కూడా ఏఐసీసీ తీవ్రంగా పరిగణించినట్టు సమాచారాం. వనపర్తి నుంచి పోటీ చేసిన మేఘారెడ్డి పార్టీకి డబ్బులిచ్చి టికెట్ కొన్నారని చిన్నారెడ్డి చేసిన ఆరోపణలపై మేఘారెడ్డి ఇప్పటికే అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి ఫిర్యాదు చేశారు. పార్టీ లైన్ తప్పుతున్న నేతలకు గుణపాఠం అయ్యేలా చర్యలు తీసుకోవాలని క్రమశిక్షణా కమిటీతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేఫథ్యంలో అధిష్టాణం సైతం పార్టీకి నష్టం కలిగించేలా, ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకం తగ్గేలా వ్యవహరించే నేతలపై కఠినంగా వ్యవహరించాలని భావిస్తోంది. క్రమశిక్షణా కమిటి నివేదిక సారాంశం, ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి, ముఖ్యమంత్రి అభిప్రాయం తీసుకున్న అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ స్థాయిలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ, చిన్నారెడ్డిని ఢిల్లీకి పిలిచి వివరణ కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. పదవులు తొలగిస్తారా, లేదా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
