EPFO: కనీస పింఛన్ వచ్చేది ఎప్పుడో.. ఈపీఎఫ్వో నిర్ణయం కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది..
ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు దాదాపుగా పీఎఫ్(EPF)లో చందదారులుగా ఉంటారు. అయితే వీరికి రిటైర్మెంట్ తర్వాత వచ్చే పీఎప్ పింఛన్(Pension) చాలా తక్కువగా ఉంటుంది...
ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు దాదాపుగా పీఎఫ్(EPF)లో చందదారులుగా ఉంటారు. అయితే వీరికి రిటైర్మెంట్ తర్వాత వచ్చే పీఎప్ పింఛన్(Pension) చాలా తక్కువగా ఉంటుంది. అందుకే వారు కనీస పింఛన్ ఇవ్వాలని కోరుతున్నారు. కనీస పింఛను పెంపు కోసం దాదాపు 40 లక్షల మంది లబ్ధిదారులు లక్షల కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయిదేళ్లుగా రూ.1000 ఉన్న కనీస పింఛన్ మొత్తాన్ని పెంచేందుకు ఈపీఎఫ్వో ట్రస్టీబోర్డు కమిటీల మీద కమిటీలు వేయడం తప్ప స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం లేదు. ఇప్పటికే రెండు కమిటీలు నివేదికలు ఇవ్వగా.. మూడు నెలల క్రితం పింఛను సంస్కరణల పేరిట ఏర్పాటు చేసిన అడ్హక్ కమిటీ(Ad hoc Committee) మరో నివేదిక సమర్పించింది.
దీనిపై లోతైన అధ్యయనం చేయాలని కోరుతూ పింఛను నిధి నియంత్రణ సంస్థ (పీఎఫ్ఆర్డీఏ), ఎల్ఐసీ, వీవీగిరి కార్మిక శిక్షణ కేంద్రంతో పాటు మరో ఇద్దరు పెట్టుబడుల అధికారులతో టాస్క్ఫోర్స్ కమిటీని ఈపీఎఫ్వో ట్రస్టీబోర్డును నియమించింది.అయితే 2014లో కనీస పింఛను రూ.1000 అమల్లోకి వచ్చేవరకు.. కొందరికి ఏళ్లుగా రూ.100లోపే వచ్చేది. ప్రస్తుతం రూ.2 వేల లోపు పొందుతున్న పింఛనుదారులు దాదాపుగా 74 శాతం ఉన్నారు. ఇది పలు రాష్ట్రాల్లో ఇచ్చే వృద్ధాప్య సహా ఇతర సామాజిక భద్రత పింఛన్ల డబ్బు కంటే తక్కువ. దీంతో పింఛను కనీస మొత్తాన్ని పెంచాలని కార్మిక సంఘాలు కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి.
అసంఘటిత కార్మికుల పింఛనును రూ.3 వేలుగా నిర్ణయించడంతో ఆ మేరకు వేతన జీవులకు అవకాశమివ్వాలని కోరుతున్నారు. గతంలో రెండు ఉన్నతస్థాయి కమిటీలు కనీస పింఛను రూ.2 వేలు, రూ.3 వేలుగా ఖరారు చేసేందుకు సాధ్యాసాధ్యాలపై నివేదికలు ఇచ్చాయి. రెండేళ్ల క్రితం ఏర్పాటైన కమిటీ కనీస పింఛను రూ.2 వేలకు పెంచితే రూ.5,955 కోట్ల అదనపు భారం ఉంటుందని, 40 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని పేర్కొంది. ఈపీఎఫ్ కనీస పింఛను పెంచేందుకు తీసుకురావాల్సిన సంస్కరణలపై అడ్హక్ కమిటీ ఏడుసార్లు సమావేశమై పలు విషయాలను అధ్యయనం చేసింది. ఈ సిఫార్సులను పరిశీలించిన కార్మిక సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు కొన్ని సూచనలు చేశారు.
వీటిపై భిన్నాభిప్రాయాల నేపథ్యంలో ట్రస్టీబోర్డు తాజాగా టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. పింఛను చెల్లింపులకు వినియోగించే ఈపీఎస్ నిధి సుస్థిరత దెబ్బతినకుండా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అడ్హక్ కమిటీ నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం పదేళ్లు ఈపీఎఫ్ చందాదారుడిగా సర్వీసు ఉంటే పింఛను పొందేందుకు అర్హులు. ఈ కాలపరిమితిని 15 ఏళ్లకు పెంచితే పింఛను సదుపాయాలు 33 శాతం పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఈ మేరకు ఈపీఎఫ్ చట్ట సవరణలు, ప్రభుత్వ వాటా చెల్లింపు, ఈపీఎస్ నిధులను వివిధ మార్గాల్లో పెట్టుబడులుగా పెట్టడం తదితర మార్గాలపై ఆలోచించాలని కమిటీ తెలిపింది.
Read Also.. Campus IPO: వచ్చే నెలలో రానున్న క్యాంపస్ యాక్టివ్వేర్ ఐపీఓ.. ఇప్పటికే సెబికి దరఖాస్తు చేసిన కంపెనీ..