Liquor effect మద్యం లేక కోమాలోకి మహిళ
లాక్ డౌన్ కారణంగా నిలిచి పోయిన మద్యం అమ్మకాలు మద్యానికి అలవాటు పడిన వారిలో కొత్త సమస్యలు తెచ్చి పెడుతోంది. మద్యం దొరక్క అల్లాడిపోతున్న వారు వింతగా ప్రవర్తిస్తున్నారు.
Woman fell into coma for because of liquor non-availability: లాక్ డౌన్ కారణంగా నిలిచి పోయిన మద్యం అమ్మకాలు మద్యానికి అలవాటు పడిన వారిలో కొత్త సమస్యలు తెచ్చి పెడుతోంది. మద్యం దొరక్క అల్లాడిపోతున్న వారు వింతగా ప్రవర్తిస్తున్నారు. మరికొందరైతే మతిస్థిమితం కోల్పోయి ఆసుపత్రులకు చేరుతున్నారు. హైదరాబాద్లోని ఎర్రగడ్డ మానసిక రోగుల ఆసుపత్రికి వందకు పైగా రోగులు చేరుకున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ మద్యం దొరక్క నరాలు లాగేసి ఏకంగా కోమాలోకి చేరిన ఉదంతం ఆంధ్రప్రదేశ్లోని పాశర్లపూడిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
తూర్పు గోదావరి జిల్లా మామిడి కుదురు మండలం పాశర్లపూడి శ్రీరామ్ పేటలో మద్యానికి అలవాటు పడిన ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది. ప్రతి నిత్యం బ్రాందీ తాగే అలవాటున్న బొమిడి మంగమ్మ అనే మహిళ గత పది హేను రోజులుగా మందు దొరక్క విలవిల్లాడింది. నరాలు లాగేయడంతో కోమాలోకి వెళ్ళిందని ఆమె కుటుంబీకులు చెబుతున్నారు. మంగమ్మను రాజోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆమె కుటుంబ సభ్యులు.
మంగమ్మ పరిస్థితి విషమంగా వుండడంతో రాజోలు ఆసుపత్రి వైద్యులు ఆమెను కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (జీజీహెచ్)కు రెఫర్ చేశారు. కాకినాడ ఆసుపత్రికి చేరుకున్న మంగమ్మను పరిశీలించిన జీజీహెచ్ డాక్టర్లు కూడా ఆమె పరిస్థితి విషమంగా వుందని తేల్చారు. లాక్ డౌన్ తమ ప్రాణాలను హరిస్తోందని, తమ తల్లి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుందని మంగమ్మ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. కోనసీమ ప్రాంతంలో మరికొందరి పరిస్థితి కూడా మంగమ్మ లాగే వుందని వారు చెబుతున్నారు.