దివిసీమలో చెన్నై మత్స్యకారుల టెన్షన్…అధికారుల అటెన్షన్
ఒకవైపు కరోనా వైరస్ ప్రబలడంతో తమిళనాడు అతలాకుతలం అవుతుంటే.. మరోవైపు ఉన్నట్టుండి తమిళ మత్స్యకారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? చెన్నై మత్స్యకారులను చూసి ఏపీ ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆందోళనకు ప్రభుత్వాలు ఏం సమాధానం చెబుతాయి? మేము చెన్నై తిరిగి వెళ్లలేమని, తమకు ఇక్కడే వసతి కల్పించాలని కోరుతున్న తమిళ మత్స్యకారుల విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది?
ఒకవైపు కరోనా వైరస్ ప్రబలడంతో తమిళనాడు అతలాకుతలం అవుతుంటే.. మరోవైపు ఉన్నట్టుండి తమిళ మత్స్యకారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? చెన్నై మత్స్యకారులను చూసి ఏపీ ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆందోళనకు ప్రభుత్వాలు ఏం సమాధానం చెబుతాయి? మేము చెన్నై తిరిగి వెళ్లలేమని, తమకు ఇక్కడే వసతి కల్పించాలని కోరుతున్న తమిళ మత్స్యకారుల విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది? ఇప్పుడు కృష్ణాజిల్లాలో.. మరీ ముఖ్యంగా దివిసీమలో గట్టిగా వినిపిస్తున్న ప్రశ్నలు ఇవి.
మంగళవారం మధ్యాహ్నం కృష్ణా జిల్లా నాగాయలంక సమీపంలోని ఎదురుమొండి దీవుల్లో ఉన్నట్టుండి తొంభై మంది తమిళ మత్స్యకారులు ప్రత్యక్షమయ్యారు. వారంతా నాలుగు సముద్రపు బోట్లలో చెన్నై నుంచి శ్రీకాకుళం వైపు వెళ్ళేందుకు బయలుదేరారు. అయితే మార్గ మధ్యంలో తినుబండారాలు పాడయిపోవడంతో పాటు.. సముద్రంలో ఎదురు వెళ్లలేక ఎదురుమొండి దీవులకు చేరుకున్నట్లు చెబుతున్నారు. అసలే కృష్ణాజిల్లాలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కొత్తగా వచ్చిన సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక స్థానిక అధికారులు బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. మరో వైపు చెన్నై మత్స్యకారులను చూసి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
చెన్నై నుంచి సముద్ర మార్గంలో శ్రీకాకుళం వైపు వెళుతున్న మత్స్యకారులు.. తమ నాలుగు పడవలను నాగాయలంక మండలం ఎదురుమొండి దీవులకు మంగళవారం మధ్యాహ్నం చేర్చారు. సముద్రంలో ఏర్పడిన తుపాను అలజడి ఒకవైపు, తమ వద్ద ఉన్న ఆహార పదార్థాలు పాడవడం మరోవైపు.. తమను ఎదురుమొండి వైపు మళ్లించాయని తమిళం మత్స్యకారులు చెబుతున్నారు. సముద్రంలో తుఫాను తాకిడి ఉంది.. దానికి తోడు తినుబండారాలు లేకపోవడంతో తాము తిరిగి వెళ్లలేమని తమకు ఎక్కడో ఒకచోట వసతి కల్పించాలని వారు కోరుతున్నారు. అవసరమైతే తమను క్వారెంటైన్లో ఉంచాలని, క్వారెంటైన్ పీరియడ్ ముగిసిన తర్వాతనే తాము తిరిగి వెళ్తామని మత్స్యకారులు చెబుతున్నారు. తాజాగా చెన్నై నుంచి వచ్చిన మత్స్యకారుల విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లిన కృష్ణా జిల్లా అధికారులు.. వారి సూచనల ప్రకారం నడుచుకుంటామని స్థానిక మీడియాకు తెలిపారు.