Big News Big Debate: వైరస్ వెర్సస్ ఎంట్రన్స్
JEE మెయిన్, నీట్ టెస్టులను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఓ పక్క కరోనా విజృంభిస్తున్నా ప్రభుత్వం పరీక్షలకు నిర్వహించడానికే మొగ్గు చూపింది.
- విద్యార్ధులకు అగ్నిపరీక్షే…!
- ప్రాణమా? చదువా అంటున్న సామాజికవేత్తలు
- కెరీర్ ముఖ్యమంటున్న విద్యావేత్తలు
- నడుమ రాజకీయ యుద్ధం
JEE మెయిన్, నీట్ టెస్టులను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఓ పక్క కరోనా విజృంభిస్తున్నా ప్రభుత్వం పరీక్షలకు నిర్వహించడానికే మొగ్గు చూపింది. విలువైన విద్యా సంవత్సరాన్ని స్టూడెంట్స్ కోల్పోరాదనే సదుద్దేశంతోనే పరీక్షలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అంతేకాదు.. పరీక్షల సందర్భంగా విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై NTA పలు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఎగ్జామ్స్ నిర్వహించండపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. అటు ప్రజాసంఘాలు, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్ధుల చదువుల సంగతేమో కానీ.. వారి జీవితాలతో చెలగాటమే అంటున్నారు సామాజికవేత్తలు. పరీక్షల నిర్వహణపై సుప్రంలో దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. దీంతో రివ్యూ వేయాలని బీజేపీయేతర సీఎంలు ప్రయత్నాల్లో ఉన్నారు.
సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు JEE మెయిన్స్ పరీక్షలు, నీట్ పరీక్ష సెప్టెంబర్ 13న నిర్వహించేందుకు NTA షెడ్యూల్ విడుదల చేసింది. పరీక్షల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్సిగ్నల్ ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వడంతో లైన్ క్లియర్ అయింది. దీంతో పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. కోవిడ్–19 నేపథ్యంలో విద్యార్థులెవరికీ ఇబ్బందులు తలెత్తకుండా అన్నీ చర్యలు చేపడుతున్నామంటోంది. ఈ పరీక్షల నిర్వహణలో విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలు పాటిస్తూ సహకారించాలని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి కొన్ని నిబంధనలు కూడా విడుదల చేసింది. ఈ సారి ఆన్లైన్లో జరిగే JEE మెయిన్ పరీక్షలకు దేశవ్యాప్తంగా 8లక్షల 58వేల మంది నమోదు చేసుకున్నారు. ఇక ఆఫ్లైన్లో జరిగే నీట్ పరీక్షకు 15లక్షల 97వేలమంది హాజరవుతున్నారు.
అయితే పరీక్ష నిర్వహణపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థి సంఘాలు, సామాజికవేత్తలు కూడా వాయిదా వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది విద్యార్థుల ప్రాణాలతో చెలగాడం ఆడడమేనని విమర్శిస్తున్నాయి. ఒకరి నుంచి ఒకరికి కరోనా వైరస్ సోకకుండా భౌతిక దూరం పాటించేంత మౌలిక సౌకర్యాలు మన విద్యాలయాల్లో ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారు. అటు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రులు అమరీందర్ సింగ్, అశోక్ గహ్లోత్, భూపేష్ బాగేల్, హేమంత్ సోరేన్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే పాల్గొని పరీక్షలు వాయిదా వేయాలన్నారు. తాజాగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా అభ్యంతరం చెబుతూ ప్రధానికి లేఖ రాశారు. అవసరమైతే కోర్టును మళ్లీ ఆశ్రయించాలని కాంగ్రెస్ పాలిత సీఎంలు నిర్ణయించారు. అటు కొందరు సామాజికవేత్తలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇందులో చేతన్ భగత్, సోనూసూద్, సుబ్రహ్మణ్యస్వామి ఉన్నారు. అయితే పరీక్షలు నిర్వహించాలని 150మందికి పైగా విద్యావేత్తలు ప్రధానికి లేఖరాయడం విశేషం.
మొత్తానికి అసలు పరీక్షలకంటే మందే ఉంటుందా? లేదా అన్నది విద్యార్ధులకు అగ్నిపరీక్షగా మారింది. మరి ముందుముందు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి. 90శాతం విద్యార్థులు అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకుని.. రెడీ కావడం కొసమెరుపు. JEE మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 7-11 జరగాల్సి ఉండగా.. కరోనాతో జులై 18-23కు వాయిదా పడింది. వైరస్ తీవ్రత తగ్గకపోవడంతో మళ్లీ సెప్టెంబర్ 1-6కు వాయిదా వేశారు. ఇక నీట్ పరీక్ష షెడ్యూల్ ప్రకారం మే 3న జరగాలి. అది కాస్తా జులై 26కు వాయిదా పడింది. ఫైనల్ గా ఇప్పుడు సెప్టెంబర్ 13న నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఎగ్జామ్స్ అప్డేట్స్:
- జేఈఈ మెయిన్స్ పరీక్షలు సెప్టెంబర్ 1 నుంచి 6, నీట్ పరీక్ష సెప్టెంబర్ 13
- 99%మందికి తొలి ప్రిఫరెన్స్ పరీక్ష కేంద్రం
- జేఈఈ మెయిన్స్కు 570 నుంచి 660కు పెంపు
- నీట్ కేంద్రాలను 2వేల 546 నుంచి 3వేల 843కు పెంచారు
- JEE షిఫ్ట్ల సంఖ్య గతంలో 8, ప్రస్తుతం12
- అభ్యర్థుల సంఖ్య షిఫ్ట్కు 1.32 లక్షలు, ఇప్పుడు 85 వేలు
- జేఈఈ మెయిన్కు 8.58 లక్షల మంది అభ్యర్ధులు
- నీట్కు 15.97 లక్షల మంది రిజిస్ట్రేషన్
- నీట్ పరీక్ష కేంద్రాల్లో గదికి 12మంది (గతంలో 24)
- తెలంగాణ పరీక్ష జరిగే సిటీలు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం
- నీట్ సెంటర్లు 112, నీట్ విద్యార్ధులు 55,800, JEE విద్యార్థులు 67,319
ఏపీలో పరీక్ష జరిగే సెంటర్లు:
- విశాఖ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు
- 151 పరీక్షల కేంద్రాలు, నీట్ అభ్యర్థులు 45,000, JEE విద్యార్ధులు 61,892
విద్యార్ధులకు జాగ్రత్తలు:
- JEE, నీట్ పరీక్షల విద్యార్థులకు కండీషన్లు
- శరీర ఉష్ణోగ్రత 99.4 ఫారిన్హీట్ డిగ్రీల కంటే ఎక్కువుంటే స్పెషల్ రూమ్
- ఐసోలేషన్ గదుల్లోనే డాక్యుమెంట్ వెరిఫికేషన్
- 15-20 నిమిషాల ముందుగా రావాలి
- ఇటీవల కోవిడ్ సింటమ్స్పై సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి
- ఎగ్జామ్ సెంటర్ వద్దే పరీక్షకు ముందు సబ్మిట్ చేయాలి
- విద్యార్థులు ముఖానికి మాస్క్లు, చేతికి గ్లౌజ్లు
- వాటర్ బాటిల్, శానిటైజర్ తప్పనిసరి
- పరీక్షా కేంద్రాల వద్ద భౌతిక దూరం
- ఎగ్జామ్ సెంటర్లోకి కేవలం అడ్మిట్ కార్డుకే అనుమతి
- కేటాయించిన స్లాట్ల ప్రకారం పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాలి
- ప్రతి ఒక్కరు చేతులను శుభ్ర పరచుకోవాలి
- పరీక్ష తరువాత ఒక్కొక్కరుగా బయటికి వెళ్లాలి
- పరీక్ష ముగిసిన వెంటనే మాస్క్, గ్లోవ్స్ని చెత్తబుట్టలో పడేయాలి
కాగా, కరోనా వైరస్ తీవ్రత కారణంగా ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం ఈ పరీక్షలను రద్దు చేయాలని, ఇంటర్ మార్కుల ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసింది. అటు ఒడిశా సీఎం నవీన్పట్నాయక్ ఈ సమయంలో ఎగ్జామ్స్ నిర్వహించడం విద్యార్ధులను రిస్క్ లో పెట్టినట్లే అని అంటున్నారు. ఇక ఢిల్లీ డిప్యూటీ సీఎం పరీక్షలు వాయిదా వేయాలని కేంద్రమంత్రి రమేష్ పోక్రియాల్కు లేఖ రాశారు. పరీక్షల నిర్వహణపై కేంద్రం మరోసారి పునరాలోచన చేయాలని మనీష్ సిసోడియా అన్నారు.
నీట్, జేఈఈ పరీక్షల రద్దుపై సోనియాగాంధీ వీడియో కాన్ఫరెన్స్:
- మద్దతు తెలిపిన పంజాబ్ సీఎం అమరీందర్సింగ్
- రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాత్
- చత్తీస్ఘడ్ సీఎం భూపేష్ బాగేల్
- బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
- మహారాష్ట్ర సీఎం ఉద్దావ్ థాక్రే
- పరీక్షల నిర్వహణను వ్యతిరేకిస్తున్న సామాజిక వేత్తలు
- రచయత చేతన్ భగత్, నటుడు సోనూసూద్
- బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి
నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణకు సపోర్టుగా ప్రధానికి లేఖ:
- ప్రధానికి 150 మంది విద్యావేత్తల లేఖ
- JEE, నీట్ పరీక్షలు నిర్వహించండి
- వాయిదా అంటే విద్యార్ధుల భవిష్యత్తుతో రాజీపడటమే
- కోవిడ్ను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది
- విద్యార్ధులను కెరీర్ పణంగా పెట్టొద్దు
- లక్షలమంది విద్యార్ధుల కెరీర్కు సంబంధించిన అంశం
- JNU, BHU, IGNOU అధ్యాపకులు
- విదేశీ యూనివర్శిటీల అధ్యాపకుల సంతకాలు
- నిర్వహణలో వెనక్కు తగ్గొద్దని వాదన