
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ మరింత స్పీడ్ పెంచింది. ఇప్పటికే అనేక దఫాలుగా విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు.. ఎంపీ అవినాష్ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేశారు. పులివెందుల లోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చారు సీబీఐ అధికారులు. ఈ నెల 6వ తేదీన కచ్చితంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు సీబీఐ అధికారులు. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, అధికారులు వచ్చినప్పుడు ఎంపీ అవినాష్ ఇంట్లో లేకపోవడంతో ఆయన తండ్రి భాస్కర్రెడ్డికి చెప్పి వెళ్లారు అధికారులు. ఇప్పటికే అవినాష్ను రెండుసార్లు విచారించిన సీబీఐ.. ఇప్పుడు మరోసారి విచారించేందుకు సిద్ధమైంది. కాగా, వివేకా హత్య కేసులో మొదటి నుంచి ఎంపీ వైఎస్ అవినాష్ పై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీబీఐ అధికారులు ఆయన్ను విచారించారు. ఇక అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డికి కూడా సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..