
యువత ఇప్పుడు చదువు మీద కన్నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారు.. తిండి తినడం మానేస్తున్నారేమో కాని రీల్స్ చూడటం, చేయడం మాత్రం ఆపడం లేదు ..తాజాగా ఇలానే ఇన్స్టా రీల్స్ చేసే క్రమంలో ఐదుగురిలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ తీవ్ర విషాద ఘటన కడప జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కడప నగరానికి చెందిన ఐదుగురు యువకులు సరదాగా రీల్స్ చేసుకునేందుకు నగర శివారు ప్రాంతంలోని వాటర్ గండి ప్రాంతానికి వెళ్లారు. అక్కడున్న నీటిలో దిగి రీల్స్ చేయడం స్టార్ట్ చేశారు.
ఈ క్రమంలో నీటి ప్రవాహం పెరగడంతో ఐదుగురిలో ముగ్గురు యువకులు నీటిలో కొట్టుకుపోయారు. అది గమనించిన అక్కడే ఉన్న ఒక గజహితగాడు ఒక యువకుడిని కాపాడాడు. కానీ మిగతా ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.. దీంతో కంగారు పడిపోయిన తోటి యువకులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
రాత్రి వరకు వెతికినా ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో.. సోమవారం ఉదయం మళ్లీ గాలింపు చర్యలు చేపట్టి కొట్టుకుపోయిన ఇద్దరు యువకుల మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం వారి మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. మృతులు అశోక్ నగర్కు చెందిన గెంటెన్ రోహిత్, కామినేని నరేష్ గా పోలీసులు గుర్తించారు.
రీల్స్ పిచ్చితో యువత తమ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని.. యువత ఇలాంటి ప్రమాదకర రీల్స్ చేయొద్దని ఎన్ని సార్లు హెచ్చరించినా వినట్లేదని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో రీల్స్ చేసే వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.