Delhi: ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఖరారు.. అక్కడి నుంచే ఎంపీగా వైఎస్ షర్మిల పోటీ..?

|

Apr 01, 2024 | 1:24 PM

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేసే స్థానం పై దాదాపు క్లారిటీ వచ్చేసింది. ముందుగా ప్రచారం జరగినట్లే ఆమె కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు. ఢిల్లీలో సోమవారం ఉదయం జరిగిన కాంగ్రెస్ సీఈసీ సమావేశంలో ఆమేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Delhi: ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఖరారు.. అక్కడి నుంచే ఎంపీగా వైఎస్ షర్మిల పోటీ..?
Ap Congress
Follow us on

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేసే స్థానం పై దాదాపు క్లారిటీ వచ్చేసింది. ముందుగా ప్రచారం జరగినట్లే ఆమె కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు. ఢిల్లీలో సోమవారం ఉదయం జరిగిన కాంగ్రెస్ సీఈసీ సమావేశంలో ఆమేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్లు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వవైభవాన్ని తీసుకురావాలని ఉవ్విళ్లూరుతోంది. ఏపీపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ వారసురాలు వైఎస్ షర్మిలను రంగంలోకి దించింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‎లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా సిద్దం చేసింది అధిష్ఠానం.

గత దశాబ్ధంగా పోటీ చేసినప్పటికీ నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా హస్తం పార్టీకి రాలేదు. ఈ నేపథ్యంలోనే 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాలకు గట్టిపోటీ ఇవ్వాలని నిర్ణయించుకుంది. మొత్తం ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. అయితే 58 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాలను పెండింగ్‎లో ఉంచింది. వీటిని మినహా మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనకు సానుకూలంగా ఉంది సీఈసీ. 117 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను కూడా ఖరారు చేసింది. రేపు అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఇదిలా ఉంటే విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఎవరు ఏ ఏ స్థానాల నుంచి బరిలో నిలువనున్నారో ఇప్పుడ చూద్దాం.

కడప పార్లమెంట్‌ బరిలో వైఎస్ షర్మిల నిలబడనున్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ నుంచి తన కుటుంబసభ్యుడు అవినాశ్ రెడ్డిపై పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. రాజమండ్రి పార్లమెంట్‌ బరిలో గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం పోటీ చేయనున్నట్లు సమాచారం. అలాగే కాకినాడ బరిలో మాజీ ఎంపీ పల్లంరాజు, విశాఖ పార్లమెంట్ బరిలో సినీ నిర్మాత సత్యారెడ్డి, ఏలూరు లోక్‌సభ ఎన్నికల బరిలో లావణ్య పోటీ చేయనున్నారు. ఇక అనకాపల్లి నుంచి వేగి వెంకటేష్‌, రాజంపేట నుంచి లోక్ సభ ఎన్నికల బరిలో నజీర్‌ అహ్మద్, చిత్తూరు నుంచి చిట్టిబాబు, హిందూపురం నుంచి షాహీన్ పేర్లు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏమిటంటే.. గతంలో ఏపీ పీసీసీ అధ్యక్షునిగా, మాజీ మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరా రెడ్డి ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానప్పటికీ పరోక్షంగా పార్టీకి పనిచేయనున్నట్లు పార్టీ వర్గాల నుంచి అందిన సమాచారం. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తరఫున స్టార్ క్యాంపెయింగ్ చేయడానికి రఘువీరా రెడ్డి సిద్దమైయ్యారని చర్చ జరుగుతోంది. పైన తెలిపిన స్థానాలు పక్కన పెడితే.. తిరుపతి, నంద్యాల, అనంతపురం, గుంటూరు, విజయవాడ, అమలాపురం, కర్నూల్, అరకు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది హస్తం పార్టీ. దీనికి కారణం కమ్యూనిస్టులు, ఇతర వామపక్ష పార్టీలు తమతో కలిసి వస్తారన్న ఆలోచనలో భాగంగా ఈ స్థానాలను పెండింగ్ లో పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..