Andhra News: కాసేపట్లో తాళికట్టాల్సి ఉంది.. అంతలోనే ఆగిన పెళ్లి.. అసలు ఏం జరిగిందంటే?
విజయనగరం జిల్లా సంతకవిటి మండలం మిర్తివలసలో పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. భాజాభజంత్రీలు, మేళతాళాలు, బంధువుల హడావుడి, పెళ్లికి రెడీ అవుతున్న వధూవరులు, ఇల్లంతా హడావుడి.. ప్రతి ఒక్కరిలో ఆనందం వెల్లివిరుస్తుంది. మరికాసేపట్లో పెళ్లికొడుకు, పెళ్లి కూతురు పెళ్ళిపీటల పై కూర్చొని ఒకటవ్వాల్సిన శుభ సమయం దగ్గర పడుతుంది. కానీ ఇంతలో పెళ్లికొడుకు ఇంట ఒక్కసారిగా ఆర్తనాదాలు అందరిలో విషాదాన్ని నింపాయి.

తన తమ్ముడు పెళ్లిని ఘనంగా జరపాలని పెళ్లికొడుకు అన్న సతీష్ అన్ని ఏర్పాట్లను స్వయంగా చూసుకుంటూ బిజిబిజీగా ఉన్నాడు. వచ్చే పోయే బంధువులను పలకరిస్తూ పెళ్లి పనులు చేస్తున్నాడు. అందులో భాగంగా విద్యుత్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు సతీష్కు కరెంట్ షాక్ తగిలింది. కరెంట్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో సతీష్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వైద్య సిబ్బంది చేరుకునేలోపే సతీష్ ప్రాణాలు కోల్పోయాడు.
ఈ సంఘటనతో పెళ్లి ఇంట్లో ఆనంద వాతావరణం అంతా ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది. పెళ్లికొడుకు అన్నయ్యగా సతీష్ పెళ్లి పనుల్లో కీలకంగా వ్యవహరిస్తున్న వేళ అతని మృతి అందరినీ కలిచివేసింది. ఈ ఘటనతో పెళ్లి కార్యక్రమం నిలిచిపోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సతీష్కు గత ఆగస్టులోనే వివాహం జరిగింది. సతీష్ మరణవార్త తెలిసి గ్రామస్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
పెళ్లయి కేవలం తొమ్మిది నెలలు మాత్రమే అవ్వడంతో సతీష్ మరణ వార్త విన్న సతీష్ భార్య కన్నీరు మున్నీరుగా విలపించింది. జీవితం సాఫీగా సాగుతుందనుకున్న సమయంలో ఇలాంటి ఘటన జరగడం ఆమెను తీవ్ర విషాదంలోకి నెట్టింది. సతీష్ మృతి కుటుంబానికి తీరని లోటుగా మారింది. గ్రామంలో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పెళ్లి ఇంట్లో జరిగిన ఈ విషాదం గ్రామస్థుల హృదయాలను కలిచివేసింది.

Andhra News
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
