Visakhapatnam: ఏఐ నగరంగా వైజాగ్.. ఏకంగా రూ.లక్ష కోట్లతో TCS డేటా సెంటర్ ఏర్పాటు
మరో దిగ్గజ సంస్థ విశాఖకు రానుంది. ఏకంగా రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడితో 1,000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ముందుకొచ్చింది. ఈ మేరకు సీఎం చంద్రబాబుతో టీసీఎస్ చర్చలు జరుపుతుంది. దీంతో గూగుల్, సిఫీ టెక్నాలజీస్ సౌకర్యాల తర్వాత వైజాగ్లో..

విశాఖపట్నం, అక్టోబర్ 11: విశాఖపట్నం ఏఐ నగరంగా రూపుదిద్దుకుంటోంది. తాజాగా మరో దిగ్గజ సంస్థ విశాఖకు రానుంది. ఏకంగా రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడితో 1,000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ముందుకొచ్చింది. ఈ మేరకు సీఎం చంద్రబాబుతో టీసీఎస్ చర్చలు జరుపుతుంది. దీంతో గూగుల్, సిఫీ టెక్నాలజీస్ సౌకర్యాల తర్వాత వైజాగ్లో ఇది మూడో డేటా సెంటర్గా అవతరించనుంది. డేటా సెంటర్కు ఇందనం అందించడానికి TCS తన సొంత ప్లాంట్ల నుంచి పునరుత్పాదక శక్తిని ఉపయోగించాలని యోచిస్తోంది. దాని అధిక నీటి అవసరాలను తీర్చడానికి, డీశాలినేషన్ ప్లాంట్ను కూడా నిర్మించనున్నారు.
నవంబర్ నెలలో టీసీఎస్ విశాఖలో డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించనుంది. డేటా సెంటర్ ఏర్పాటుపై అధికారిక ప్రకటన చేయాలని సంస్థ భావిస్తున్నట్లు ఒక ఉన్నతాధికారి తెలిపారు. ఇటీవల టీసీఎస్ సంస్థల ఛైర్మన్ చంద్రశేఖరన్ సీఎం చంద్రబాబును సచివాలయంలో కలిసి డేటా సెంటర్ ప్రతిపాదనపై చర్చించారు. రాబోయే రెండేళ్లలో డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా ప్రపంచ దిగ్గజ సంస్థలు సుమారు రూ.2,60 లక్షల కోట్ల పెట్టుబడులు విశాఖకు రానున్నాయి. డేటా సెంటర్ల ఏర్పాటుతో ప్రత్యక్ష ఉపాధి కంటే.. అంతకు పదిరెట్లకు పైగా పరోక్ష ఉపాధి లభిస్తుందని నిపుణులు అంటున్నారు.
భారీగా ఉపాధి అవకాశాలు
వైజాగ్ ప్రపంచ డేటా హబ్గా మారితే డేటా సెంటర్ల కేంద్రంగా ఏఐ స్టార్టప్లు, ఏఐ ఆధారిత కంపెనీలు విశాఖ వైపు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. డేటా సెంటర్ల రాకతో హైస్పీడ్ కంప్యూటింగ్, యానిమేషన్, గేమింగ్, వీహెచ్ఎఫ్ఎక్స్, ఏఐ క్లౌడ్ రంగాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మరోవైపు గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్, సిఫీ, మెటా వంటి దిగ్గజ సంస్థలు విశాఖ నుంచి కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రభుత్వంతో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. వీటి రాకతో విశాఖపట్నం టెక్నాలజీ రంగంలో ఉపాధికి కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఆయా సంస్థలు ఏర్పాటు చేసే హైస్పీడ్ డేటా సెంటర్లతో ఏఐ, క్వాంటమ్, బ్లాక్చైన్ టెక్నాలజీ వంటి సంస్థల ఏర్పాటుకు కూడా భవిష్యత్తులో విశాఖ కేంద్రంగా మారే అవకాశం ఉంది. టీసీఎస్ విశాఖలో ఏర్పాటు చేసే డెవలప్మెంట్ సెంటర్ ద్వారా రూ.1400 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. దీని ద్వారా సుమారు 12,000 మందికి ఉపాధి లభించనుంది. ఇదే తరహాలో కాగ్నిజెంట్, యాక్సెంచర్ సంస్థలు మరో 25 వేల మందికి, సత్వా, ఏఎంఎన్ఎస్ ద్వారా మరో 15 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.
వైజాగ్కు అండర్ సీ కేబుల్ ప్రాజెక్ట్ వాటర్వర్త్
TCS తోపాటు మెటా తన అండర్ సీ కేబుల్ ప్రాజెక్ట్ వాటర్వర్త్ కోసం వైజాగ్ను ఎంచుకుంది. 400 మిలియన్ డాలర్ల బ్లూ-రామెన్ సబ్సీ కేబుల్ కోసం సిఫీ టెక్నాలజీస్ దాని ల్యాండింగ్ భాగస్వామిగా వ్యవహరిస్తుంది. 2030 నాటికి ల్యాండింగ్ జరుగుతుందని అంచనా. సుమారు 50 వేల కి.మీ.లకు పైగా విస్తరించి ఉన్న వాటర్వర్త్ అమెరికా, భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలను కలుపుతూ ప్రపంచంలోనే అతి పొడవైన సబ్సీ కేబుల్గా అవతరించనుంది. విశాఖపట్నంను ఎంచుకోవడంలో గూగుల్లో మెటా చేరడం పట్ల ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ చర్య వైజాగ్ను దేశంలోనే AI, డేటా సిటీగా మారుస్తుందని ఆయన అన్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




