విశాఖ దుర్ఘటన విషాదకరం..ఎట్టకేలకు స్పందించిన ఎల్జీ పాలిమర్స్
ప్రమాద బాధితులకు, ఆ కుటుంబాలకు అండగా ఉంటామని, వారి బాధ్యతను తీసుకుంటామని ఎల్జీ పాలిమర్స్ భరోసా నిచ్చింది.
విశాఖ గ్యాస్ లీకేజ్ దుర్ఘటనపై ఎట్టకేలకు స్పందించింది ఎల్జీ పాలిమర్స్. జరిగిన ప్రమాదం అత్యంత దారుణమైనదిగా పేర్కొంది. గ్యాస్ లీకేజీ ఘటన దురదృష్టకరమని వాపోయింది..ప్రమాద బాధితులకు తమ సానుభూతిని తెలియజేస్తూ..క్షమాపణలు కోరింది. ప్రభుత్వం, సంబంధిత అధికారులతో కలిసి ప్రమాదానికి కారణాలపై తమ కంపెనీ తరపున విచారణ జరుపుతున్నామని తెలియజేసింది. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
విశాఖ పాలిమర్ కంపెనీలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని చెప్పుకొచ్చారు. ప్లాంట్లో తమ సిబ్బంది పగలు, రాత్రి తేడా లేకుండా ప్రభుత్వంతో కలిసి కష్టపడుతోందని చెప్పారు. జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి… సమర్థవంతమైన సంరక్షణ ప్యాకేజీని అందించడానికి ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రమాద బాధితులకు, ఆ కుటుంబాలకు అండగా ఉంటామని, వారి బాధ్యతను తీసుకుంటామని ఎల్జీ పాలిమర్స్ భరోసా నిచ్చింది. ప్రమాద బాధితులు, చనిపోయిన వారి కుటుంబాలకు సాయం చేయడానికి, అండగా ఉండటానికి.. ఒకవేళ ఏదైనా సమస్యలు వస్తే పరిష్కరించడానికి ఓ స్పెషల్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది..త్వరలోనే బాధిత కుటుంబాలందరినీ సంప్రదిస్తామని పేర్కొంది. మరోవైపు ప్రమాద సమయంలో సాయం చేసిన ప్రతి ఒక్కరికీ కంపెనీ తరపున ధన్యవాదాలు తెలిపింది. ముఖ్యంగా పోలీసులు, ప్రభుత్వం, స్థానిక యువకులు చేసిన కృషికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.