కేసీఆర్ కీలక నిర్ణయం..త్వరలో భారీగా ఏఈవోల నియామకం
సమగ్ర వ్యవసాయ విధానం అమలుకోసం ఏఈఓ క్లస్టర్లలో క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత ఉండొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్..తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్త నందించారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ భరోసా కల్పించే దిశగా విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కులవృత్తుల ద్వారా ఎంతో మందిని ఆదుకుంటున్న సీఎం కేసీఆర్..తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సమగ్ర వ్యవసాయ విధానం అమలుకోసం ఏఈఓ క్లస్టర్లలో క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత ఉండొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగుల నియామకానికి ఆదేశాలిచ్చారు. ఈ మేరకు మంత్రి నిరంజన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. వ్యవసాయ విస్తరణాధికారులు గ్రేడ్-2 (ఏఈవో) పోస్టుల నియామక ప్రక్రియకు అనుమతి ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 194 ఏఈవో గ్రేడ్-2 పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా ఉంటుందని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా కలెక్టర్లకు అప్పగించినట్లు వివరించారు. అభ్యర్థుల ఎంపికలో మార్కులు, మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికగా ఉంటుందని స్పష్టం చేశారు. నిరుద్యోగ అభ్యర్థులు ఈ విషయంలో ఎలాంటి ఆపోహాలు పెట్టుకోవలసిన అవసరం లేదన్నారు. దళారులను ఆశ్రయించి మోసపోవద్దని హితవు పలికారు. పోస్టుల నియామకాలలో ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేదని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.