
విశాఖ ఏజెన్సీ పాడేరు మోదకొండమ్మ అమ్మవారి జాతరలో విషాదం చోటు చేసుకుంది. జాతరలో ఏర్పాటు చేసిన జెయింట్ వీల్ కేబిన్ రాడ్డు విరిగింది. ఈ ప్రమాదంలో భవానీ అనే యువతి అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్, పాడేరు ఆసుపత్రులకు తరలించారు.
జీ మాడుగుల మండలం గురికబందకు చెందిన ఓ కుటుంబం అమ్మవారి జాతర చూసేందుకు వచ్చారు. దర్శనం తర్వాత జాతరలోని జెయింట్ వీల్ ఎక్కారు భవానీ, మురళి, గాయత్రి, సురేష్. వీల్ ఎక్కిన సంతోషంలో తనమునకలై సెల్ఫీలు తీసుకుని ఎంజాయ్ చేశారు. అయితే.. ఇంతలోనే సరదా కాస్తా విషాదంగా మారింది.
జెయింట్ వీల్ కేబిన్ రాడ్ విరిగిపోవడంతో భవానీ కిందపడి స్పాట్లో మృతి చెందింది. మృతురాలి చెల్లెలు గాయత్రి కాలు విరిగింది. సురేష్ జెయింట్ వీల్ రాడ్ను పట్టుకోవడంతో స్వల్పగాయాలతో బయటపడ్డారు. అదే కేబిన్లో మురళి అనే మరో వ్యక్తి కిందపడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి. జాతరలో ఇంత పెద్ద ప్రమాదం జరిగినా.. గంట వరకూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకోకపోవడం గమనార్హం.