ఆధునిక యుగంలోనూ అమానుషం! పది నెలలుగా పగ.. 43 కుటుంబాలకు నరకప్రాయం!
శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్న ఆధునిక యుగంలోనూ.. ఇంకా కొన్ని గ్రామాల్లో సామాజిక బహిష్కరణలు కొనసాగడం నాగరిక సమాజానికే మాయని మచ్చగా మారుతోంది. తాజాగా కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం, పోలేకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని తోటపేట గ్రామంలో ఇటువంటి అమానుష ఘటన వెలుగుచూసింది.

శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్న ఆధునిక యుగంలోనూ.. ఇంకా కొన్ని గ్రామాల్లో సామాజిక బహిష్కరణలు కొనసాగడం నాగరిక సమాజానికే మాయని మచ్చగా మారుతోంది. తాజాగా కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం, పోలేకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని తోటపేట గ్రామంలో ఇటువంటి అమానుష ఘటన వెలుగుచూసింది. గ్రామానికి చెందిన 43 కుటుంబాలను గ్రామ పెద్దలు గత పది నెలలుగా వెలివేసి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న వైనం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ఊరిలోని కిరాణా కొట్లలో వీరికి సరుకులు ఇవ్వడం లేదు. చివరకు హోటళ్లలో కనీసం టిఫిన్ కూడా దక్కకుండా ఆంక్షలు విధించారు. వ్యవసాయ పనుల్లోనూ తీవ్ర ఆటంకాలు సృష్టిస్తూ, పంట చేతికొచ్చే సమయంలో వరి కోత మిషన్లను రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఉపాధి హామీ కూలీల మధ్య కూడా రెండు వర్గాలుగా విభజించి దూరం పెంచారు. గ్రామాల్లో జరిగే ఎలాంటి శుభకార్యాలకు, పండుగలకు వీరిని రానివ్వకుండా పూర్తిగా దూరం పెట్టారు.
దీంతో గత 11 నెలలుగా తాము మానసిక నరకయాతన అనుభవిస్తున్నామని బాధితులు టీవీ9 ద్వారా తమ ఆవేదనను పంచుకున్నారు. ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. అధికారులు వచ్చినప్పుడు కలిసి ఉంటామని చెప్పే గ్రామ పెద్దలు, వారు వెళ్లిన తర్వాత మళ్లీ పాత పద్ధతినే అవలంబిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి ఈ సామాజిక బహిష్కరణ బారి నుండి తమ కుటుంబాలను కాపాడి, న్యాయం చేయాలని బాధితులు దీనంగా వేడుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
