
ఏపీలోని వందే భారత్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఊరట కలిగించేలా మరో ప్రకటన చేసింది. వందే భారత్ ఎక్స్ప్రెస్లకు పలు రైల్వే స్టేషన్లలో కొత్తగా హాల్ట్ సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ప్రయాణికులు, ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంటుంది. అందులో భాగంగా ఇప్పటికే ఏపీలో పలు వందే భారత్ రైళ్లకు కొన్ని రైల్వే స్టేషన్లలో కొత్తగా హాల్ట్ సౌకర్యం ఏర్పాటు చేయగా.. దీని వల్ల వేలాదిమంది ప్రయాణికులకు లబ్ది చేకూరుతోంది. ఈ క్రమంలో రైల్వేశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో మరో వందే భారత్ రైలుకు కొత్తగా మరో రైల్వే స్టేషన్లో హాల్ట్ ఫెసిలిటీ కల్పించింది.
సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఈ రైలు ఇక నుంచి తాడేపల్లి గూడెం రైల్వే స్టేషన్లో కూడా ఆగనుంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి భూపతిరాజు వెల్లడించారు. స్థానికుల నుంచి వచ్చిన వినతులను రైల్వేశాఖ దృష్టికి భూపతిరాజు తీసుకెళ్లారు. దీంతో రైల్వేశాఖ సానుకూలంగా స్పందించింది. మరో 15 రోజుల్లో దీనిపై రైల్వేశాఖ అధికారికంగా ప్రకటన విడుదల చేసే అవకాశహుంది. దీంతో తాడేపల్లిగూడెం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు వందే భారత్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. దీని వల్ల మెరుగైన ప్రయాణ అనుభూతి కలగనుంది. భీమవరంలోని బీజేపీ కార్యాలయలంలో జిల్లాకు సంబంధించి అంశాలపై భూపతిరాజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెంలో వందే భారత్ ఎక్స్ప్రెస్కు హాల్ట్ సౌకర్యం గురించి వివరాలు వెల్లడించారు.
సికింద్రాబాద్-విశాఖపట్నం(20834) వందే భారత్ రైలు మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్లో బయల్దేరుతుంది. ఇది వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకొట మీదుగా విశాఖపట్నంకు 11.35 గంటలకు చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో విశాఖపట్నం-సికింద్రాబాద్(20833) వందే భారత్ ట్రైన్ ఉదయం 05.45 గంటలకు విశాఖ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇప్పటివరకు వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి, సామర్లకొటలో మాత్రం ఈ రైలు ఆగుతుండగా.. కొత్తగా తాడేపల్లిగూడెంలో కూడా త్వరలో ఆగనుంది. దీంతో తాడేపల్లిగూడెం చుట్టపక్కల ప్రాంతాల ప్రజలు వందే భారత్ రైలు సౌకర్యం అందుబాటులోకి రానుంది. దీంతో చుట్టుపక్క ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే సికింద్రాబాద్-విశాఖ మార్గంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో రైల్వేశాఖ అనేక ప్రత్యేక రైళ్లను కూడా ఈ రూట్లో నడుపుతోంది. అలాగే పలు వందే భారత్ రైళ్లు కూడా ఈ మార్గంలో ప్రయాణికులకు మెరుగైన ప్రయాణాన్ని కల్పిస్తున్నాయి.