Andhra Pradesh: వాళ్లు బతికే ఉన్నారు.. నేపాల్ వరద బాధితుల కుటుంబ సభ్యులు ఏమన్నారంటే..
Andhra Pradesh: ముగ్గురు కుమారుల్లో సంతోష్ కుమార్ సాహు పెద్దవారు. సంతోష్ కుమార్ సాహు పదో తరగతి వరకు పార్వతీపురంలోనే చదువుకున్నారు. అనంతరం విశాఖపట్నంలో ఇంటర్, డిగ్రీ విద్యను పూర్తి చేసి ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం లండన్ వెళ్లి అక్కడే..

Andhra Pradesh: నేపాల్లో సంభవించిన భారీ వరదల నేపథ్యంలో గల్లంతైనట్లు ప్రచారం జరిగిన పార్వతీపురానికి చెందిన సాహు కుటుంబం పై కొంత ఊరట కలిగించే సమాచారం కుటుంబసభ్యులు వెల్లడించారు. పార్వతీపురం పట్టణం పండా వీధికి చెందిన సంతోష్ కుమార్ సాహు, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు వరదల్లో కొట్టుకుపోలేదని, ప్రమాదం సంభవించడానికి ముందే వారు ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయినట్లు ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా కుటుంబసభ్యులకు సమాచారం అందటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సంతోష్ కుమార్ సాహు (47), ఆయన భార్య సురభిపాడి (43), కుమారుడు స్పందన సాహు (14), కుమార్తె సైనా కుమారి సాహు (13) ఇటీవల భారత్కు వచ్చారు. అనంతరం ఓ ట్రావెల్ సంస్థ ద్వారా మానస సరోవరం యాత్రకు వెళ్లారు. యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో భాగంగా నేపాల్ మీదుగా వస్తున్న సమయంలో అక్కడ భారీ వరదలు సంభవించాయి.
ఈ క్రమంలో సాహు కుటుంబం వరదల్లో చిక్కుకుపోయిందన్న సమాచారం స్థానికంగా ఆందోళనకు కారణమైంది. అయితే శనివారం ముంబైలో ఉంటున్న సంతోష్ కుమార్ సాహు మామ, దక్షిణాఫ్రికాలో ఉంటున్న ఆయన సోదరుడు మురళీ సాహు ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వరదలు సంభవించడానికి సుమారు రెండు గంటల ముందే సాహు కుటుంబం వరదలు వచ్చిన ప్రాంతం నుంచి బయలుదేరినట్లు ట్రావెల్ వాహనం డ్రైవర్ ఫోన్ ద్వారా తెలిపినట్లు వెల్లడించారు. అంతేకాకుండా సంతోష్ కుమార్ సాహు కుటుంబం వరదల్లో గల్లంతైనట్లు ఢిల్లీ పోలీసులు, నేపాల్ అధికారులు లేదా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించలేదని బంధువులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: Gold Price: భారతదేశంలో అత్యంత తక్కువ ధరకే లభించే బంగారం.. ఎక్కడో తెలుసా?
అయితే సంతోష్ కుమార్ సాహు కుటుంబ ఆచూకీ పై మరింత స్పష్టమైన సమాచారం అందాల్సి ఉంది. దీంతో సాహు కుటుంబం ప్రస్తుతం క్షేమంగానే ఉన్నట్లు బంధువులు భావిస్తున్నారు. వారు త్వరలోనే ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులు, బంధువులకు అందుబాటులోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడయ్యే వరకు ఎలాంటి నిర్ధారణకు రావద్దని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సంతోష్ కుమార్ సాహు తండ్రి సుభాష్ చంద్ర సాహు పార్వతీపురంలో ఫారెస్ట్ అధికారిగా పనిచేసి సుమారు 15 ఏళ్ల క్రితం పదవీ విరమణ చేశారు. ఆయన భార్య సుమారు రెండేళ్ల క్రితం మృతి చెందారు.
ఇది కూడా చదవండి: House Construction: ఇంటి గోడలపై పగుళ్లు వస్తున్నాయా? ఈ 9 తప్పులు చేయకపోతే మీ భవనం నూరేళ్లు పదిలం!
ముగ్గురు కుమారుల్లో సంతోష్ కుమార్ సాహు పెద్దవారు. సంతోష్ కుమార్ సాహు పదో తరగతి వరకు పార్వతీపురంలోనే చదువుకున్నారు. అనంతరం విశాఖపట్నంలో ఇంటర్, డిగ్రీ విద్యను పూర్తి చేసి ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం లండన్ వెళ్లి అక్కడే స్థిరపడినట్లు బంధువులు తెలిపారు. నేపాల్ వరదల నేపథ్యంలో తమ కుటుంబ సభ్యుల గురించి ఆందోళన చెందిన పార్వతీపురం బంధువులకు తాజాగా అందిన సమాచారం కొంత ఊరటనిచ్చినప్పటికీ వారి నుంచి నేరుగా ఎలాంటి కమ్యూనికేషన్ లేకపోవడంతో ఒకింత ఆందోళన అయితే కొనసాగుతుంది. సాహు కుటుంబం నుంచి నేరుగా సమాచారం అందే వరకు వారి పూర్తి క్షేమం పై అధికారిక స్పష్టత కోసం మాత్రం ఎదురుచూడాల్సిన పరిస్థితి కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Milk Packet Colors: పాల ప్యాకెట్ల రంగుల వెనుక ఇంత అర్థం ఉంటుందా? నీలం, ఆకుపచ్చ, నారింజలో ఏ పాలు మంచివి?
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




