Weather Alert: మరో మూడు రోజులు వర్షాలే.. ఆదివారానికి అల్పపీడనం మరింత బలపడే అవకాశం..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని..

Weather Alert: మరో మూడు రోజులు వర్షాలే.. ఆదివారానికి అల్పపీడనం మరింత బలపడే అవకాశం..
Ap Rains
Follow us

|

Updated on: Sep 10, 2022 | 4:47 PM

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని తెలిపింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన చోట చర్యలు చేపట్టాలని సూచించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తూర్పుగోదావరి (East Godavari) జిల్లాలో కురుస్తున్న వానలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమలాపురంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అల్లూరి జిల్లాలోని ముంపు మండలాల్లో కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వర రామచంద్రాపురం, చింతూరు మండలాల మధ్య ఉన్న వంతెన ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుపోయింది. దీంతో సమీప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురంలో వర్షపు నీరు చేరింది. ఇళ్ల మధ్యలోనే నీరు నిలిచిపోయింది.

కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు కరవు ప్రాంతంగా పేరు గాంచిన అనంతపురం జిల్లాలో కుంటలు, చెరువులు నిండాయి. దశాబ్దాలుగా చుక్క నీరు కూడా కనిపించని ప్రాంతాలన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. కాగా.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఆదివారానికి మరింత బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంపై రుతుపవన ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల శనివారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది.

ఇవి కూడా చదవండి
Ap Rain News

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..