
పాము తన గుడ్లు తానే తిన్నట్లు.. ఓ తండ్రి చేసిన పని సభ్యసమాజం తలదించుకునేలా చేసింది.. పిల్లలు లేరని.. ఓ ఆడ బిడ్డను దత్తత తీసుకుని పెంచిన తండ్రే.. కామంతో కళ్ళు నెత్తికెక్కి.. లైంగిక దాడి చేశాడు.. పెంపుడు తండ్రితో పాటు అతని బావమరిది కూడా ఒకరి తర్వాత మరొకరు కొన్ని నెలలుగా లైంగిక దాడి చేయడంతో ఇప్పుడు ఆ మైనర్ బాలిక ఐదు నెలల గర్భవతి. శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలో 14 ఏళ్ల మైనర్ బాలిక గర్భం దాల్చడం అనేది స్థానికంగా కలకలం రేపింది. ధర్మవరం పట్టణానికి చెందిన వీరాంజనేయులు దంపతులకు పిల్లలు పుట్టకపోవడంతో 14 సంవత్సరాల క్రితం చిత్తూరు జిల్లా బోయకొండ గంగమ్మ తల్లి ఆలయం ప్రాంతం నుంచి ఓ ఆడ బిడ్డను దత్తత తీసుకొని పెంచుకున్నారు..
ప్రస్తుతం బాలిక వయసు 14 సంవత్సరాలు. బాలిక పెంపుడు తండ్రి వీరాంజనేయులు అతని బావమరిది నరసింహులు ఇద్దరు మద్యం మత్తులో నెలల తరబడి ఆ మైనర్ బాలికపై లైంగిక దాడి చేస్తున్నారు. బాలికను బెదిరించి అత్యాచారం చేయడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐదు నెలల గర్భవతి అయిన మైనర్ బాలిక… అనారోగ్యంతో ఆసుపత్రి కి వెళ్లగా అసలు విషయం బయటపడింది. పెంచిన తల్లి బాలికను అడగగా పెంపుడు తండ్రి, అతని బావమరిది ఇద్దరూ కలిసి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని చెప్పింది. దీంతో మైనర్ బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్ స్వయంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైనర్ బాలికను విచారించగా పెంపుడు తండ్రి, బావమరిది కలిసి అత్యాచారం చేశారని మైనర్ బాలిక వాంగ్మూలం ఇచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మైనర్ బాలిక బత్తలపల్లి ఆర్డిటి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పెంపుడు తండ్రి వీరాంజనేయులు పరారవ్వగా అతని బావమరిది నరసింహులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంచే చేను మేసింది అన్న చందంగా కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కామంతో కళ్ళు మూసుకుపోయి కాటేస్తే ఆ ఆడపిల్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..