Vande Bharat Express: సికింద్రాబాద్ టూ తిరుపతి.. కేవలం 7 గంటల్లోనే.. వందేభారత్ ప్రారంభం అప్పుడేనా!
శ్రీవారి భక్తులు ఎప్పుడెప్పుడూ అని ఎదురు చూస్తోన్న వందేభారత్ రైలుపై మరో కీలక అప్డేట్ వచ్చేసింది..

శ్రీవారి భక్తులు ఎప్పుడెప్పుడూ అని ఎదురు చూస్తోన్న వందేభారత్ రైలుపై మరో కీలక అప్డేట్ వచ్చేసింది. ఏప్రిల్ నెలలో ఈ రైలును పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోన్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అప్గ్రెడేషన్ పనుల ప్రారంభానికి వచ్చే నెలలో ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో వందేభారత్ రైలును సైతం జెండా ఊపి ప్రధానమంత్రి ప్రారంభించనున్నారని సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే తిరుపతి-సికింద్రాబాద్ మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ ట్రయిల్ రన్ పూర్తయింది. అంతేకాకుండా.. ఈ రెండు నగరాలను కనెక్ట్ చేసేందుకు నాలుగు మార్గాలు అందుబాటులో ఉండగా.. మొదటిగా నారాయణాద్రి ఎక్స్ప్రెస్ వెళ్లే రూట్లోనే వందేభారత్ను నడపనున్నారట. అంటే సికింద్రాబాద్ నుంచి బీబీనగర్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా ఈ వందేభారత్ రైలు తిరుపతి చేరుకోనుంది.
ఆ తర్వాత శావల్యపురం-ఒంగోలు రూట్ పూర్తయ్యాక.. అటు నుంచి వందేభారత్ ఎక్స్ప్రెస్ను తిప్పనున్నారని సమాచారం. ఇక వందేభారత్ రైలు ప్రారంభమైతే.. సికింద్రాబాద్ నుంచి తిరుపతి.. 12 గంటలు కాస్తా.. ఇకపై ఆరున్నర గంటల నుంచి 7 గంటల ప్రయాణం అవుతుంది. కాగా, వందేభారత్ రైలులో ఎగ్జిక్యూటివ్ చైర్ కారు ధర రూ. 2వేలు పైచిలుక.. ఏసీ చైర్ కారు రూ. 1150గా ఉండొచ్చునని సమాచారం.