SK University: వర్సిటీ నుంచి ఇంటికి మారిన మృత్యుంజయ హోమం.. వివాదానికి ఎండ్ కార్డ్ వేసిన రిజిస్ట్రార్‌ లక్ష్మయ్య..

అనంతపురం ఎస్కే యూనివర్సిటీలో మృత్యుంజయ హోమం వివాదానికి బ్రేక్‌ పడింది. యూనివర్సిటీ క్యాంపస్‌ నుంచి ఇంటికి హోమాన్ని షిఫ్ట్‌ చేశారు వీసీ. అసలీ వివాదం ఏంటి? ఎందుకు వెనక్కి తగ్గారో ఇప్పుడు చూద్దాం.

SK University: వర్సిటీ నుంచి ఇంటికి మారిన మృత్యుంజయ హోమం.. వివాదానికి ఎండ్ కార్డ్ వేసిన రిజిస్ట్రార్‌ లక్ష్మయ్య..
SK University

Updated on: Feb 24, 2023 | 9:14 AM

అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తలపెట్టిన ధన్వంతరి మృత్యుంజయ హోమానికి బ్రేక్‌ పడింది. వర్సిటీ క్యాంపస్‌లో నిర్వహించాలనుకున్న శాంతి హోమాన్ని రద్దు చేస్తున్నట్టు సర్క్యులర్‌ జారీ చేశారు ఎస్కేయూ రిజిస్ట్రార్‌ లక్ష్మయ్య. ఈ హోమాన్ని తన ఇంట్లోనే నిర్వహించేందుకు నిర్ణయించారు రిజిస్ట్రార్. అయితే ఇందు కోసం మొత్తం ఏర్పాట్లను తన ఇంట్లోనే చేస్తున్నారు. హోంలో పాల్గొనేవారు తన ఇంటికి వస్తారని వెల్లడించారు. రిజిస్టార్ లక్ష్మయ్య తీసుకున్న నిర్ణయంతో వివాదకు ఎండ్ కార్డ్ పడింది.

ఎస్కే యూనివర్సిటీలో మృత్యుంజయ హోమం తలపెట్టడంపై వివాదం చెలరేగింది. విజ్ఞానాన్ని నేర్పించాల్సిన యూనివర్సిటీలో ఎలా హోమాలు నిర్వహిస్తారంటూ హేతువాద, విద్యార్ధి సంఘాలు ఆందోళనలకు దిగాయ్‌. ఇలాంటి హోమాలు ఏమైనా చేసుకోవాలనుకుంటే యూనివర్సిటీ బయట చేసుకోవాలని, కాదని మొండిగా హోమం నిర్వహిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు.

అయితే, యూనివర్సిటీలో మృత్యుంజయ హోమం తలపెట్టడాన్ని సమర్ధించుకున్నారు ఎస్కేయూ వీసీ రామకృష్ణారెడ్డి. ఉద్యోగుల క్షేమం కోసమే యాగం చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. చందా వసూలు కోసం సర్క్యులర్‌ ఇచ్చింది కూడా నిజమేనన్నారు వీసీ. అంతేకాదు, ఈనెల 24న యూనివర్సిటీ స్టేడియంలో యాగం చేయబోతున్నట్లు తేల్చిచెప్పారు. వచ్చేవాళ్లు రావొచ్చు-ఇష్టంలేనోళ్లు రావక్కర్లేదంటూ ప్రకటనలు కూడా గుప్పించారు.

నెలరోజుల్లో ఐదుగురు ఉద్యోగులు చనిపోయారని, అందుకే మృత్యుంజయ హోమం తలపెట్టినట్టు చెప్పుకొచ్చారు. వీసీ రామకృష్ణారెడ్డితోపాటు రిజిస్ట్రార్‌ లక్ష్మయ్య కూడా యూనివర్సిటీలో మృత్యుంజయ హోమాన్ని సమర్ధించుకున్నారు. చేస్తే తప్పేంటంటూ మాట్లాడారు రిజిస్ట్రార్‌. ఉద్యోగుల్లో భయం పోగొట్టడానికే ఈ హోమం అంటూ చెప్పుకొచ్చారు.

దాంతో, యూనివర్సిటీ క్యాంపస్‌లో మృత్యుంజయ హోమం ఎలా నిర్వహిస్తారంటూ ఎస్కేయూ వీసీ రామకృష్ణారెడ్డిని నిలదీశారు విద్యార్ధి నేతలు. హేతువాద సంఘం నేతలైతే వీసీ రామకృష్ణారెడ్డిని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఓ విద్యావంతుడైయుండి ఏంటీ నిర్ణయాలంటూ మండిపడ్డారు ఏపీ హేతువాద సంఘం అధ్యక్షుడు నార్నే వెంకటసుబ్బయ్య.

విమర్శల జడివానతో వెనక్కి తగ్గారు ఎస్కేయూ వీసీ వీసీ రామకృష్ణారెడ్డి. యూనివర్సిటీ క్యాంపస్‌లో ఇవాళ తలపెట్టిన మృత్యుంజయ హోమాన్ని రద్దు చేస్తున్నట్లు సర్క్యులర్‌ ఇచ్చారు. దాంతో, ఎస్కే యూనివర్సిటీలో చెలరేగిన వివాదానికి తెరపడినట్టయ్యింది

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం