
కర్నూలు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు దగ్గర V కావేరీ ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలిబూడిదైంది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న క్రమంలో.. ఓ బైక్ను బస్సు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత బైకు బస్సుకిందకు వెళ్లి పేలిపోవడంతో.. మంటలు అంటుకున్నాయి.
ఆ తర్వాత క్రమంగా బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. మంటలు చెలరేగడంతో 12 మంది ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటపడ్డారు. పలువురు ప్రయాణీకులు సజీవదహనం అయినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీ వర్షం కురిసింది.
ఇదిలా ఉండగా.. బెంగళూరు వెళ్తున్న బస్సు టూవీలర్ను ఢీకొట్టిడంతో ఈ ప్రమాదం జరిగిందని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. పొగను గమనించి స్థానికులు బస్సు అద్దాలు పగలగొట్టారు. కొంత మంది బయటపడ్డా, మరికొంత మంది రాలేకపోయారు. మంటలతో లోపల ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు ఎస్పీ. ఈ ఘటన గురించి తెలియగానే FSL టీమ్ స్పాట్కు చేరింది. బస్సు ఎక్స్ట్రా డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నాం. డ్రైవర్ను కూడా పంపించాలని ట్రావెల్స్ యాజమాన్యానికి చెప్పామన్నారు ఎస్పీ. ప్రమాద తీవ్రత ఈస్థాయిలో ఉంటుందని డ్రైవర్లు అంచనా వేయలేకపోయారని పేర్కొన్నారు.
అటు ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సీఎస్, అధికారులతో మాట్లాడారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. బాధితులకు అవసరమైన సహాయం అందించాలన్నారు.