
ప్రకాశం జిల్లా వాసులకు స్థానికంగా ఉన్న జ్యువెలరీ షాప్ నిర్వహాకులు కీలక సూచనలు చేశారు. ప్రకాశం జిల్లా అద్దంకి, మేదరమెట్ల పరిధిలో ఉన్న జ్యువెలరీ షాపులు వారం రోజుల పాటు మూసి వేశారు. ఆషాడ మాసం సందర్భంగా బులియన్ మర్చంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యాపారులు అందరూ కలిసి.. వారం రోజుల పాటు షాపులకు సెలవు ప్రకటిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఒకవైపు ఆషాడ మాసం కావడంతో ఎలాంటి శుభకార్యాలు లేకపోవడం.. మరోవైపు బంగారం ధరలు రోజురోజుకూ పెరిగిపోతుండటంతో బులియన్ మార్కెట్లో వ్యాపారాలు పూర్తిగా మందగించాయి. దీంతో అద్దంకి, మేదరమెట్లలోని బంగారం వ్యాపారులంతా కలిసి ఒకేసారి గుజరాత్ విహారయాత్రకు బయలుదేరారు. జులై 22 నుండి జులై 28 వరకు షాపులు మూసివేస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు.
తిరిగి జులై 29న షాపులు పునఃప్రారంభం కానున్నాయని తెలిపారు. అయితే వ్యాపారులంతా టూర్కు వెళ్లడంతో, బంగారం ఆభరణాలు తయారుచేసే స్థానిక స్వర్ణకారులు, కార్మికులు పనులు లేక ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వారం రోజుల పాటు వినియోగదారులు, కస్టమర్లు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని అసోసియేషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.