
అనంతపురం జిల్లా, అక్టోబర్ 01: పది రోజుల వ్యవధిలో నలభై పశువులు మృతి చెందాయి. పశువుల వరుస మరణాలు అనంతపురం జిల్లాలోని ఎల్లుట్ల గ్రామ రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. వింత వ్యాధితో పశువులు చనిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతుండడంతో పశు వైద్యాధికారులు రంగంలోకి దిగారు. పశువులు ఎందుకు చనిపోతున్నాయో తెలుసుకునేందుకు చనిపోయిన ఆవులు, గేదెల మృతదేహాలపై వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అవును, అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో గత పది రోజులుగా వరుసగా పశువులు చనిపోతున్నాయి. విషయం తెలుసుకున్న పశుసంవర్దక శాఖ అధికారులు గ్రామంలో పర్యటించి.. చనిపోయిన పశువులను పరిశీలించి వాటికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టంలో పశువుల పొట్టలో ఉన్న వస్తువులు చూసి డాక్టర్లే షాక్ అయ్యారు.
ఆవు,గేదెల పొట్టలో కిలోల కొద్దీ ప్లాస్టిక్ కవర్లు, పంట పొలాలకు ఏర్పాటు చేసిన డ్రిప్ పైప్లు, ఇతర ప్లాస్టిక్ పదార్థాలను బయటకు తీశారు. పశువులు మేతకు వెళ్ళినప్పుడు పొలాల్లో క్రిమి సంహారక మందులు వాడి పడేసిన ప్లాస్టిక్ కవర్లు, డ్రిప్ ఇరిగేషన్కు సంబంధించిన పైపులను పశువులు తింటున్నాయని పశు సంవర్దక శాఖ అధికారులు గుర్తించారు.
అలాగే చనిపోయిన పశువుల గుండె, కాలేయము, కిడ్నీ, పేగులు, రక్తము, పేడ వంటి అనేక శాంపిల్స్ను తీసుకుని ప్రొద్దుటూరు, తిరుపతి వెటర్నరీ ల్యాబ్కు.. మరికొన్ని కర్ణాటకలోని పరీక్ష కేంద్రాలకు పంపించి.. రిపోర్ట్ వచ్చాక పశువుల మరణాలకు పూర్తి కారణాలు చెబుతామంటున్నారు పశుసంవర్దక శాఖ ఉన్నతాధికారులు. ప్రాదమికంగా అయితే కలుషితమైన నీరు, గడ్డి, ఇతరాలు తినడం వల్లే పశువులు చనిపోతున్నాయని.. వింత వ్యాధి లక్షణాలు ఏమైనా ఉన్నాయా అన్నది ల్యాబ్ రిపోర్ట్ వచ్చాకే తెలుస్తుందని పశుసంవర్దక శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు.