By Elections: హుజురాబాద్, బద్వేల్లో ముగిసిన నామినేషన్ల పర్వం.. ఇక వేడెక్కనున్న ప్రచారం..
Huzurabad Badvel By Elections: తెలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నిక జరగనున్న హుజురాబాద్, బద్వేల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో 26 నామినేషన్లు దాఖలు కాగా.. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా బద్వేల్లో 15 నామినేషన్లు దాఖలయ్యాయి...
తెలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నిక జరగనున్న హుజురాబాద్, బద్వేల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో 26 నామినేషన్లు దాఖలు కాగా.. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా బద్వేల్లో 15 నామినేషన్లు దాఖలయ్యాయి. అక్టోబర్ 11న స్క్రూటీని చేయనున్నారు. అక్టోబర్ 13వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. ఈనెల 30న పోలింగ్ జరగనుండగా నవంబర్ 2న ఓట్లలెక్కింపు చేపట్టనున్నారు.
హుజురాబాద్లో చివరి రోజు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ మంత్రి హరీశ్రావుతో కలిసి ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ వేశారు. పీసీసీ ఉపాధ్యక్షులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్తో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ నామ పత్రాలు దాఖలు చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్లతో కలిసి బీజేబీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ వేశారు.