Itlu Mee Niyojakavargam: తీరని సమస్యలు.. నెరవేరని హామీలు.. సౌమ్యంగా ఉంటే ఓట్లు పడతాయా? ఈసారి జగన్మోహనం పనిచేస్తుందా..?
కౌన్బనేగా నందిగామ ఎమ్మెల్యే... ! సీఎం జగన్ ఆశీస్సులు తనకే అంటున్నారు ఎమ్మెల్యే జగన్. ఒకే ఇంట్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ... సీఎం నుంచి డబుల్ ధమాకా తీసుకున్న అన్నదమ్ములిద్దరూ... ఇంతకు మించి అంటూ కంబైన్డ్గా జనం మనసు దోచుకోడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. మళ్లీ విక్టరీ ఖాయమన్న భరోసాతో ఉన్నారు. కానీ.. ప్రధాన ప్రత్యర్థి నుంచి సున్నితంగా సుతారంగా హెచ్చరికలొస్తున్నాయి.

ఎన్టీఆర్ జిల్లా నందిగామ… ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం… ఇక్కడ రాజకీయం చాలా రసవత్తరం. ఏళ్ల తరబడి నందిగామలో టీడీపీదే రాజ్యం. తెలుగుదేశం ప్రస్థానంలో 1983 తర్వాత ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. మిగిలిన అన్నిసార్లూ పసుపు జెండానే ఎగిరింది. వైసీపీ వేవ్ కావచ్చు… జగన్పై ఉన్న అభిమానమూ కావచ్చు… ఇక్కడ ఎమ్మెల్యేగా జయకేతనం ఎగరేశారు మొండితోక జగన్ మోహన్రావు. 2014లో వైసీపీ నుంచి పోటీచేసి ఓడిపోయినా… వెనక్కు తగ్గకుండా ప్రజల్లోనే ఉంటూ 2019లో విక్టరీ కొట్టారు జగన్మోహన్రావు. నందిగామ ఓటరు దృష్టిలో ఆయనకున్న ప్లస్ పాయింట్స్ అనేకం.
జగన్మోహన్కి ప్లస్లు
- జగన్మోహన్ రావుకు సౌమ్యుడన్న పేరు
- సంక్షేమ పథకాల అమల్లో పూర్తిస్థాయిలో సక్సెస్!
- గడపగడపకు కార్యక్రమంలో ప్రజలతో మమేకం
- అన్నకు తోడుగా ఉంటున్న తమ్ముడు అరుణ్కుమార్
జగన్మోహన్ సోదరుడు అరుణ్ కుమార్కు ఎమ్మెల్సీ పదవినిచ్చారు సీఎం జగన్. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒకే కుటుంబంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఉండటం అరుదైన విషయం. నందిగామలో ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న డ్రైనేజి నిర్మాణం, రోడ్డు వెడల్పు వంటి పనులతో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ… సిట్టింగ్ ఎమ్మెల్యేకి మైనస్లూ లేకపోలేదు.
జగన్మోహన్కి మైనస్లు
- సొంతపార్టీలో గ్రూపు రాజకీయాలతో తలనొప్పి
- పార్టీలోకి వచ్చిన కొత్త వారికి ప్రాధాన్యత లేదనే విమర్శ
- మున్సిపల్ కౌన్సిలర్లలో అసమ్మతి
కానీ… ఈ సమస్యలన్నిటినీ పార్టీ అధిష్టానంతో మాట్లాడి పరిష్కరిస్తామనే ధీమా కనిపిస్తోంది ఎమ్మెల్యే దగ్గర. సీఎం జగన్ రూటే తన రూట్ అంటున్నారు ఎమ్మెల్యే జగన్.
మొండితోక బ్రదర్స్పై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు రావడం కూడా నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ఇసుక, గ్రావైల్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయనేది టీడీపీ అభియోగం. ఎమ్మెల్యే సోదరుడు సూడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తే… దీటుగానే సమాధానమిస్తున్నారు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్.
గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా చేసిన తంగిరాల సౌమ్య మళ్లీ గెలవడానికి స్కెచ్చులేస్తూనే ఉన్నారు. మొండితోక బ్రదర్స్ అవినీతి బాగోతాలే తమకు కలిసొస్తాయనేది ఆమెకున్న నమ్మకం. తమ హయాంలో కొంచెం తవ్వకాలు మాత్రమే జరిపిన రాఘవాపురం కొండను ఇప్పుడు పూర్తిగా తవ్వేశారన్నది ఆమె అభియోగం. అయితే… పేరుకు తగ్గట్టే సౌమ్యంగా ఉండటం, ఎమ్మెల్యేపై తగినంత దూకుడు చూపించలేకపోవడం ఆమెకున్న మైనస్లు.
తండ్రి మరణంతో ఎమ్మెల్యే అయిన సౌమ్య రాజకీయాలకు పూర్తిగా కొత్త. ఓటర్ల మనసు గెలవడంతో ఇప్పటికీ ప్రయాస పడుతూనే ఉన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమ పెత్తనం కూడా కార్యకర్తలకు మింగుడు పట్టం లేదు. నియోజకవర్గం పర్యటనల్లో టీడీపీ కేడర్ సౌమ్య వెనుక రావడం లేదన్నది కూడా ఒక అనుమానం. అయినా ప్రభుత్వ వ్యతిరేకత, చంద్రబాబుపై ప్రజల్లో ఉన్న నమ్మకం… తనను గెలిపిస్తుందంటారు తంగిరాల సౌమ్య.
సమరానికి సై అంటున్న అభ్యర్థులు సరే… సమస్యలు సవాళ్ల సంగతేంటి? నందిగామ ఓటరు నుంచి ఈ విషయంలో మిక్స్డ్ రియాక్షన్లు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలే తమకు శ్రీరామరక్ష అనేది సిట్టింగ్ ఎమ్మెల్యే ధీమా. ప్రభుత్వ వ్యతిరేకతే తమకు అవకాశమిస్తుందనే కాన్ఫిడెన్స్ టీడీపీ నేతలది.
పేరుకే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. సంఖ్యాపరంగా చూస్తే నందిగామలో కమ్మ సామాజికవర్గానిదే అప్పర్హ్యాండ్. ఆ తర్వాతి ప్లేస్ మాత్రం ఎస్సీ-ఎస్టీలది. 41వేల కమ్మ ఓటర్లు, 32 వేలు మాదిగ, 17 వేలు మాల సామాజిక వర్గం ఓట్లు, 17 వేల మంది కాపులు, 16 వేల మంది యాదవులు, మరో 16 వేల ముస్లిం మైనారిటీలు… ఇక్కడ నిర్ణయాత్మకం.
గత ఎన్నికల్లో అన్ని వర్గాలనూ ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు వైసీపీ అభ్యర్థి మొండితోక. ఈసారి కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఎమ్మెల్యేకు కాస్త దూరంగా ఉన్నట్టు వినికిడి. కమ్మ అధిపత్యంతోనే ఇక్కడ వరుసగా టీడీపీ గెలుస్తూ వచ్చింది. అయితే కమ్మ, కాపు సామాజిక వర్గాల్ని దూరం చేసుకోవద్దన్న కమిట్మెంట్తో ముందుకెళ్తున్నారు మొండితోక బ్రదర్స్.
ఇందులో భాగంగానే సీఎం రోడ్డు పేరును ఎన్ఠీఆర్ రోడ్డుగా మార్చి అక్కడ ఎన్ఠీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. త్వరలో వంగవీటి రంగా విగ్రహం, దేవినేని వెంకట రమణ విగ్రహాల ఏర్పాటు చేసి ఆయా సామాజిక వర్గాల్ని ప్రసన్నం చేసుకోవాలన్నది ప్లాన్. టీడీపీ కూడా కమ్మ, కాపు ఓట్లను తేలిగ్గా తీసుకునేలా లేదు.
నందిగామలో అభ్యర్థుల్ని వేధిస్తున్న ఎడతెగని సమస్యలు కూడా లేకపోలేదు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన కొన్ని కీలక హామీలు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి.
గత ప్రభుత్వంలో టన్ను సుబాబుల్కి 4 వేల రేటు వస్తే ఇప్పుడు 23 వేలు కూడా ఇవ్వడం లేదన్నది రైతులు వేదన. గతంలో ఎమ్మెల్యే మొండితోక పాదయాత్ర చేసినా ఈ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు.
నియోజకవర్గంలోని1200 ఎకరాల ఇనాం భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రైతులు విన్నవించుకున్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. అటు… నియోజకవర్గంలోని వీరులపాడు మండల కేంద్రం మార్పు కూడా వైసీపీకి ఇబ్బంది కలిగించే అంశం.
నందిగామలో ప్రధాన పోటీదారులిద్దరూ సౌమ్యులే ఐనా… సీరియస్గానే ఫైటింగ్ చేస్తున్నారు. పరిష్కారం కాని ప్రధాన సమస్యలు, అవినీతి ఆరోపణలు సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఛాలెంజ్గా మారితే… ఆయన బలహీనతలే మా బలాలు అంటోంది వైసీపీ. చూడాలి… ఎవరి ఫేట్ ఎలా ఉండబోతోందో!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం