
Military Madhavaram: దేశ రక్షణలో ఆ గ్రామం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ ఊరిలో ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక్కరైనా సైన్యంలో సేవలందిస్తున్నారంటే నమ్మగలరా? పశ్చిమగోదావరి జిల్లాలోని ‘మిలిటరీ మాధవరం’. దేశభక్తికి, అసలైన క్రమశిక్షణకు నిలువెత్తు రూపంగా ఆ గ్రామం కొనసాగుతుంది. ఇది సాధారణ పల్లెటూరు కాదు.. దేశ సరిహద్దుల్లో శత్రువుల గుండెల్లో నిదురించే వీరుల గ్రామం. బ్రిటిష్ కాలం నాటి ప్రపంచ యుద్ధాల నుంచి నేటి సరిహద్దు పోరాటాల వరకు.. ప్రతి చారిత్రక ఘట్టంలోనూ ఈ ఊరి రక్తం చిందింది. ఒకప్పుడు గ్రామంలోని ప్రతి కుటుంబం నుంచి యువకులు సైన్యంలో చేరడం ఆనవాయితీగా ఉండేది. అందుకే ఊరి అసలు పేరు మాధవరం అయినప్పటికీ.. దేశం మొత్తం దీన్ని సగర్వంగా ‘మిలట్రీ మాధవరం’ అని పిలుచుకుంటోంది.
“మా గ్రామంలో ఆర్మీలో చేరడం అనేది కేవలం ఒక ఉద్యోగం కాదు.. అదొక జీవన విధానం, మా రక్తంలోనే ఉన్న దేశభక్తి. తాత, తండ్రి, కొడుకు.. ఇలా మూడు నాలుగు తరాలుగా దేశ సరిహద్దుల్లో నిలబడి కాపలా కాస్తున్నారని స్థానికులు గర్వంగా చెప్పుకుంటారు’ అని మాజీ సైనికుడు ఒకరు తెలిపారు.
ఇక్కడి యువతకు సైన్యంలో చేరడం కేవలం జీవనోపాధి కాదు.. భరతమాతకు సేవ చేయాలనే బలమైన ఆకాంక్ష! తరాలు మారుతున్నా.. ఈ ఊరి స్పూర్తి ఏమాత్రం తగ్గలేదు. గ్రామంలోని మాజీ సైనికులే స్వయంగా కొత్త తరానికి శిక్షణ ఇస్తూ, సైన్యంలోకి అడుగుపెట్టేలా మార్గనిర్దేశం చేస్తున్నారు. పొలాల్లో కష్టపడే సాధారణ రైతుల ఇళ్లలోనే.. దేశాన్ని కాపాడిన లెఫ్టినెంట్లు, సుబేదార్లు, సైనికుల వీరగాథలు వినిపిస్తాయి. గ్రామంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్మారక చిహ్నాలు నేటి యువతకు ప్రతిరోజూ దేశభక్తి పాఠాలు నేర్పుతున్నాయని గ్రామస్తులు తెలిపారు.
“దేశ రక్షణే పరమావధిగా.. రక్తాన్ని సైతం దేశానికి అర్పించేందుకు సిద్ధపడే ఇలాంటి గ్రామాలు మన దేశానికి నిజమైన రక్షణ కవచాలు. ప్రతి ఇంటికో సైనికుడిని అందించిన ‘మిలట్రీ మాధవరం’ యావత్ భారతదేశానికే ఆదర్శప్రాయం!” అని వారు పేర్కొన్నారు.
వీడియో చూడండి..