సోషల్ మీడియాలో పిచ్చి పరిచయాలు.. ఆపై పిచ్చి స్నేహాలు ప్రాణాలు మీదకు తెస్తున్నాయి. తాజాగా ఏపీలో వివాహిత ఇన్స్టాలో పరిచయమైన ఓ వ్యక్తి కారణంగా ప్రాణాలు తీసుకుంది. తూర్పుగోదావరి జిల్లా చక్రద్వారబంధం గ్రామానికి చెందిన ఓ వివాహిత ఇన్స్టా వినియోగించేది. అందులో ఆమెకు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఆపై వారిద్దరూ మధ్య చాలా చాటింగ్ నడిచింది. ఈ సమయంలో వివాహితను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు సదరు వ్యక్తి. దీంతో ఆమె తన వద్ద ఉన్న విలువైన బంగారు నగలు, నాలుగు లక్షల నగదు ఇచ్చింది. ఆపై బంగారు ఆభరణాలు విషయమై ఇంట్లో వాళ్లు ప్రశ్నించడంతో కలహాలు మొదలయ్యాయి. దీంతో ఆ వివాహిత పుట్టింటికి వచ్చి ఉరేసుకుని తనువు చాలించింది. మృతురాలికి ఒక పాప ఉన్నట్లు తెలిసింది.
మృతురాలి తమ్ముడు ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇన్స్టాలో పరిచయం అయిన వ్యక్తి విశాఖపట్నం చెందినవాడిగా గుర్తించారు. నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రత్యేక టీమ్స్ను రంగంలోకి దించారు. నిందితుడు గతంలో ఇంకా ఎవరైనా మోసం చేశాడా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇన్ స్టాలో.. మహిళలను పరిచయం చేసుకుని.. ఈ విధంగా కొందరు మోసాలకు పాల్పడుతున్నారని.. వనితలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. పరిచయం లేని వ్యక్తుల పంపే రిక్వెస్టులు యాక్సెప్ట్ చేయవద్దని చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..