
ఒంగోలులో దళిత సంఘాల ఆధ్వర్యంలో మనుస్మృతి ప్రతులను తగులబెట్టారు. దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని హెచ్సీఎం కాలేజి ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట మనుస్మృతికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మనువాదం నశించాలంటూ ప్లేకార్డులు ప్రదర్శించారు. ప్రతియేటా డిసెంబర్ 25న మనుస్మృతి ప్రతులను దగ్దం చేస్తున్నారు. అందులో భాగంగా డిసెంబర్ 25 కావడంతో మనుస్మృతి ప్రతులను మంటల్లో దహనం చేశారు…
మనుస్మృతి దగ్దం ఎందుకు…
అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలోని బృందం 1927 డిసెంబరు 25 తేదీన మనుస్మృతిని దహనం చేశారు. మహారాష్ట్రలోని రాయ్గడ్ జిల్లా లోని మహాద్ అనే చిన్న పట్టణంలో వేల మంది సమక్షంలో ఈ దహన కార్యక్రమం చేశారు. ఆనాటి నుంచి దేశవ్యాప్తంగా దళితులు డిసెంబర్ 25న ”మనుస్మృతి దహన దినం” గా పాటిస్తూ తగులబెడుతున్నారు.
నేపధ్యం ఏంటి…
మహాద్ పట్టణంలో 1927 మార్చి 19 న జరిగిన సత్యాగ్రహం ఘటన మనుస్మృతి దహనానికి ప్రేరణగా నిలిచింది. బహిరంగ ప్రదేశాల్లో ఇతర అగ్రవర్ణాలతో సమానంగా దళితులు కూడా వినియోగించుకునేలా ఉండాలని అప్పటి బాంబే లెజిస్లేటిక్ కౌన్సిల్ 1923లో ఒక తీర్మానం చేసింది. మహాద్ పట్టణంలో 1927 మార్చి 19 న జరిగిన సత్యాగ్రహానికి మహారాష్ట్ర, గుజరాత్ ప్రాంతాల నుంచి దాదాపు 3 వేల మంది వచ్చారు. వీరంతా ఆ గ్రామంలోని చౌదార్ చెరువు వద్దకు ఊరేగింపుగా వెళ్ళి అందులోని నీరు తాగారు. అయితే అప్పటి అగ్రవర్ణాలకు చెందిన కొంతమంది చెరువును శుద్ది చేయడంతో ఆగ్రహించిన అంబేద్కర్ అదే గ్రామంలో మరో సత్యాగ్రహం నిర్వహించారు. 1927 డిసెంబరు 25 తేదీన మనుస్మృతి ప్రతులను దహనం చేశారు. గొయ్యి తీసి అందులో గంధపు చెక్కలు పేర్చి మనుస్మృతి ప్రతులను దహనం చేశారు. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా దళిత సంఘాల ఆధ్యర్యంలో ప్రతియేటా డిసెంబర్ 25న మనుస్మృతి ప్రతులను దగ్దం చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఒంగోలులో దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్ర ఆధ్వర్యలో మనుస్మృతిని ప్రతులను దగ్దం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..