ఓవైపు మంచు, మరోవైపు అందమైన పూలవనాలు.. చూడ్డానికి రెండు కళ్లు చాలవంతే.. ఎక్కడో తెలుసా?
అనగనగా అందాల లోయ! కాశ్మీర్ లాంటి చల్లని వాతావరణం.. అక్కడి ప్రకృతి అందాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు. వాటికి మరింత వన్నె తెచ్చేలా అక్కడ రంగురంగుల పూలు కనువిందు చేస్తున్నాయి. ఒకటా రెండా లెక్కలేనన్ని పుష్పాలు విచ్చుకుంటున్నాయి. ఒకపక్క కురుస్తున్న మంచు.. మరోవైపు మనసును హత్తుకునే పుష్పాల అందం.. ఈ పూలవనాన్ని చూసేందుకు సందర్శకులు క్యూ కడుతున్నారు. మంచు కురిసే వేళలో.. అంటూ సందడి చేస్తున్నారు.

అల్లూరి జిల్లా చింతపల్లి ఏజెన్సీలోని లంబసింగి ప్రాంతం సముద్రమట్టానికి 3,500 అడుగుల ఎత్తులో ఉంది. ఎక్కడ మిగతా ప్రాంతాల కంటే ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతూ ఉంటాయి. శీతాకాలంలో ఇక్కడ ప్రకృతి అందాలు చూసేందుకు రెండు కళ్ళు చాలవు మరి. దట్టమైన పొగ మంచు.. సింగిల్ డిజిట్స్ లో నమోదయ్యే ఉష్ణోగ్రతలకు తోడు.. ప్రకృతి సుందర దృశ్యాలు కనువిందు చేస్తుంటాయి. ఆంధ్ర కాశ్మీరంగా పేరుపొందిన లంబసింగి ఇప్పుడు శీతల పంటలకు డెస్టినేషన్గా మారింది. ఆహ్లాదకరమైన వాతావరణంలో పండే పంటలు, వికసించే పుష్పాలు ఆసక్తి గల రైతులకు లాభాల పంట పండించడంతో పాటు.. స్థానిక గిరిజన యువతకు ఉపాధి కల్పిస్తున్నాయి.
ఒకే చోట అనేక వర్ణాలు
ఆరేళ్ల క్రితం చింతపల్లి మండలం లంబసింగి పంచాయతీలో పది ఎకరాల వ్యవసాయ భూమిలో యువ రైతులు స్ట్రాబెరీ సాగు వేశాడు. దీంతో పాటు మరో మూడు ఎకరాల్లో రకరకాల పూల తోట వేశారు. ఇప్పుడు కాపునకు వచ్చిన జెర్బరా, చామంతి పూలు వివిధ వర్ణాల్లో ఆకర్షిస్తున్నాయి. ఎరుపు, పసుపు, తెలుపు వర్ణాల్లో కనిపించే ఈ పూలు విచ్చుకున్న సందర్భంలో అద్భత దృశ్యం ఆవిష్కృతమైతుంది. ఇక నీలి రంగు డాలియా పూలు కూడా కనువిందు చేస్తున్నాయి. పసుపు, నీలం, ఎరుపు, తెలుపు వర్ణాల్లో అంతూరియం, బంతిపూల సాగు చేస్తున్నామని యువ రైతు కృష్ణ చెబుతున్నారు.
ఏమి హాయిలే ఇలా..
అలాగే ఈ పూల తోటకు అనుకొని 20 సెంట్లు విస్తీర్ణంలో పొద్దుతిరుగుడు పూలను కూడా సాగు చేస్తున్నారు. ఇక్కడి ప్రకృతి అందాలతో పాటు ఈ పూలవనాన్ని చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతున్నారు. ఈ అందాల పూల తోటలో ఫోటోషూట్లు చేసుకునేందుకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. దీంతో సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు పర్యాటకులు. ఏమి హాయిలే ఇలా అంటూ ఈ పూల వనంలో సందడిగా ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కలియ తిరుగుతూ ఆ పూల అందాలను ఆస్వాదిస్తున్నారు.
ఆ పంటల సాగు కూడా..
ఈ పూలతో పాటు జూకిని, బ్రోకోలి పంటలు కూడా పండిస్తున్నారు. ఉద్యాన శాస్త్రవేత్తల సహకారంతో అటువైపు పూలు, పళ్ళతోపాటు కూరగాయల సాగు కూడా చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే సందర్శకులు పూలు పళ్ళతో పాటు కూరగాయలు కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చెబుతున్నారు. దీంతో ఆ రైతుల పంట పండడంతో పాటు.. గిరిజనుల కూలీలకు ఉపాధి కలుగుతుంది. ఇదండీ అందాల ఆంధ్ర కాశ్మీరంలో ఉన్న పూల నందనవనం విశేషాలు. మీరు ఎప్పుడైనా అల్లూరి ఏజెన్సీ టూర్ ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని సందర్శించి తనివి తీర ఆ ప్రకృతితో పాటు రకరకాల రంగురంగుల పూల అందాలను ఆస్వాదించండి మరి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
