Mohan Babu: తిరుచానూరు పీఎస్లో మోహన్బాబు, విష్ణులపై కేసు నమోదు.. మరోవైపు..
విద్యార్థి నేతల కిడ్నాప్ ఘటనలో మోహన్బాబు, మంచు విష్ణుపై కేసు నమోదైంది. కాలేజీలో జరుగుతున్న అక్రమాలు బయటపెడితే.. కిడ్నాప్ చేస్తారా అని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నించారు. అయితే యాజమాన్యాన్ని డబ్బు డిమాండ్ చేశారని యూనివర్సిటీ PRO పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్టాపిక్గా మారింది.

తిరుపతి జిల్లా తిరుచానూరులో జరిగిన కిడ్నాప్ కేసుకు సంబంధించి మోహన్బాబు, మంచు విష్ణు, పీఆర్వో సతీష్పై కిడ్నాప్ కేసు నమోదైంది. విద్యార్థులు అక్బర్, వినోద్ను కిడ్నాప్ చేశారన్న ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజుల దోపిడీపై SFI నేతలు కలెక్టరేట్ ముట్టడికి సిద్దమవుతుండగా.. ఇద్దరు విద్యార్థి నేతలను మోహన్బాబు యూనివర్శిటీ బౌన్సర్లు కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. SFI నేతలు అక్బర్, వినోద్ను బౌన్సర్లు బలవంతంగా కారులో తీసుకెళ్లారని.. మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం కిడ్నాప్ చేయించిందని పోలీసులకు CPM నేతలు ఫిర్యాదు చేశారు. అడిషనల్ SP ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కిడ్నాపర్ల కారును మోహన్ బాబు యూనివర్సిటీ వరకు చేజింగ్ చేశారు. చివరికి నారావారి పల్లె దగ్గర ఉన్న మోహన్బాబు ఫాంహౌస్లో నిందితులతో పాటు కిడ్నాప్ గురైన విద్యార్థి సంఘం నేతలను పోలీసులు గుర్తించారు. తిరుచానూరు పోలీస్ స్టేషన్ దగ్గర విద్యార్థి సంఘాల నేతలు ధర్నా చేశారు. కాలేజీలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు బయటపెడితే కిడ్నాప్ చేస్తారా.. మీ కాలేజీలో విద్యార్థులకు ఇదే నేర్పుతున్నారా అని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నించారు.
మరోవైపు వర్సిటీ ప్రతిష్టను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో దుష్ర్రచారం చేశారని విద్యార్థి సంఘాల నేతలపై యూనివర్సిటీ పీఆర్వో సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యూనివర్సిటీ యాజమాన్యాన్ని డబ్బు కూడా డిమాండ్ చేశారన్నారు. దీంతో విద్యార్థి సంఘం నేత అక్బర్తో పాటు మరికొందరిపై చంద్రగిరి పీఎస్లో కేసు నమోదైంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
