జనసేన పార్టీ ప్లీనరీ సమయంలో వేదికగా మారి వార్తల్లోనిలిచింది మొదలు.. మొన్న రోడ్డు వెడల్పు చేయడం కోసం ప్రభుత్వ అధికారులు ఇళ్లను కూలుస్తున్నారు అన్న వార్తలు వినిపించడం వరకూ మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామం వార్తలకు వేదికగా మారింది. తాజాగా మరోసారి ఈ నెల 27వ తేదీన ఇప్పటం గ్రామంలో జనసేనాని పర్యటించనున్నారు.. ఈ మేరకు పార్టీ శ్రేణులు ఒక ప్రకటన చేశాయి. ఇప్పటం గ్రామంలోని పర్యటించి అక్కడ ఇళ్లు కోల్పోయిన బాధితులను మళ్ళీ జనసేనాని పరామర్శించనున్నారు. రోడ్లు విస్తరణలో భాగంగా ప్రభుత్వం కూల్చివేసిన ఇళ్ల కు సంబంధించిన బాధితులను పరామర్శించి ఒకొక్క కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సాయం పవన్ స్వయంగా అందజేయనున్నారని పార్టీ వర్గాలు ప్రకటించాయి.
గత కొన్ని రోజులుగా రాజకీయాలకు వేదికగా ఇప్పటం గ్రామం వార్తల్లో నిలుస్తోంది. ఎన్నికల కంటే ముందుగానే రాజకీయ నేతల పరామర్శలతో ఇప్పటం గ్రామం ఫుల్ బిజీగా మారింది. అయితే తమ పార్టీ ఆవిర్భావ సభకు స్థలాన్ని ఇచ్చి గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారంటూ పవన్ గతంలోనే ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు పవన్ ఇప్పటం గ్రామ ప్రజలకు నైతిక మద్దతు ఇవ్వడంతో పాటు ఆర్థికంగా కూడా సాయం చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.
జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చినందుకే ఆ గ్రామంలో ప్రభుత్వం కక్ష కట్టి.. ఇళ్లు, గోడలు కూల్చివేసిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తరువాత ఇప్పటం గ్రామానికి చేరుకుని అక్కడ కూల్చిన ఇళ్లను పరిశీలించారు. ఇప్పటంలో ఇళ్లు కూల్చివేతపై సోషల్ మీడియాలోనూ నెటిజన్లు సెటైర్లు వేస్తూ.. భారీగా ట్రోలింగ్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..