APSRTC: ఆ సమస్యకు చెక్ పెడుతూ ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఇక నుంచి బస్సుల్లో..
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో చిల్లర పెద్ద సమస్య అనే విషయం తెలిసిందే. బస్సు ఎక్కే చాలా మంది ప్రయాణికులు.. పెద్ద నోట్లు ఇవ్వడం, వారందరికీ చిల్లర సర్దుబాటు..
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో చిల్లర పెద్ద సమస్య అనే విషయం తెలిసిందే. బస్సు ఎక్కే చాలా మంది ప్రయాణికులు.. పెద్ద నోట్లు ఇవ్వడం, వారందరికీ చిల్లర సర్దుబాటు చేయడం కండక్టర్లకు తలనొప్పిగా మారుతుంది. ఒక్కోసారి ప్రయాణికులకు, ఆర్టీసీ సిబ్బందికి మధ్య చిల్లర కోసం ఘర్షణలు కూడా జరుగుతాయి. అయితే, ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. చిల్లర కోసం వెతకాల్సిన అవసరం లేకుండా సరికొత్త నిర్ణయం తీసుకుంది.
బస్సుల్లో నగదు రహిత లావాదేవీలను ప్రారంభించాలని నిర్ణయించింది ఏపీఎస్ఆర్టీసీ. పైలట్ ప్రాజెక్టు కింద విజయవాడ, గుంటూరు–2 డిపోలను ఎంపిక చేశారు. ఈ డిపోల పరిధిలో నడిచే సర్వీసుల్లో నగదు రహిత డిజిటల్ చెల్లింపులకు సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం డ్రైవర్లు, కండక్టర్ల దగ్గరున్న టికెట్ ఇష్యూయింగ్ యంత్రాల స్థానంలో, ఈ–పోస్ పరికరాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ యంత్రాలతో ప్రయాణికులు నగదు చెల్లించాల్సిన అవసరం ఉండదు. డెబిట్/క్రెడిట్ కార్డులు స్వైప్ చేసి, లేకుంటే ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం వంటి వాటితో డబ్బు చెల్లించి టిక్కెట్లు పొందొచ్చు. ఈ ప్రయోగం విజయవంతమైతే బస్సుల్లో ఇకపై చిల్లర సమస్య ఉండదు.
పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన విజయవాడ, గుంటూరు–2 డిపోల నుంచి తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి దూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసుల్లో, ఈ–పోస్ మెషీన్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఈ రూట్లలో విధులు నిర్వర్తించే డ్రైవర్లు, కండక్టర్లకు ఈ–పోస్ యంత్రాల వినియోగంపై శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో డిపో నుంచి పది మంది చొప్పున డ్రైవర్లు, డ్రైవర్ కం కండక్టర్లకు మూడు వారాలుగా శిక్షణ ఇస్తున్నారు. వీరికి శిక్షణ పూర్తయ్యాక ఈ–పోస్ యంత్రాలను బస్సుల్లో ప్రవేశపెడతారు. దశల వారీగా అన్ని డిపోల్లోనూ ఈ–పోస్ యంత్రాలను ప్రవేశపెట్టే యోచనలో ఉంది ఆర్టీసీ అధికారులు. ప్రధానంగా జాతీయ రహదారులపై సిగ్నల్ సమస్యలు, ఇంటర్నెట్ కనెక్టివిటీకి ఎలాంటి ఇబ్బందులు లేకపోవడం వల్ల ఈ పోస్ యంత్రాలు విజయవంతం అవుతాయని భావిస్తున్నారు.