
అద్దంకి పట్టణానికి చెందిన కోటేశ్వరరావు, ప్రియాంక దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి లోనైన కోటేశ్వరరావు తన భార్య ప్రియాంకను ఉరివేసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనతో ఆ కుటుంబం ఒక్కసారిగా ఛిన్నాభిన్నమైపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనపై కేసు నమోదు చేసుకన్నే పోలీసులు నిందితుడు కోటేశ్వరరావును అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుండె నిండా బాధ.. చేతిలో పరీక్ష పేపర్..
అయితే ఈ దంపతుల కుమార్తె హర్షిత ప్రస్తుతం10వ తరగతి చదువుతోంది. పట్టణంలోని ఆర్ కిడ్స్ హై స్కూల్ విద్యార్థిని అయిన హర్షిత ప్రస్తుతం జరుగుతున్న పదో తరగతి వార్షిక పరీక్షలు రాస్తోంది. తల్లి చనిపోయిన బాధలో ఉన్నా, తన చదువు పాడవకూడదన్న ఉద్దేశంతో హర్షిత ధైర్యం కూడగట్టుకుంది. స్థానిక బాలికల ఉన్నత పాఠశాల సెంటర్లో కన్నీళ్ల పర్యంతమవుతూనే తన పరీక్షకు హాజరైంది. ఒకవైపు తల్లి అంత్యక్రియలు జరుగుతూ ఉండగా మరోవైపు, ఆ చిన్నారి పరీక్షా హాల్లో కూర్చుని పరీక్ష రాస్తున్న తీరు చూసి తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆవేదనకు గురయ్యారు.
అమ్మ జ్ఞాపకాలతో, నాన్న చేసిన ఘాతుకాన్ని తలుచుకుంటూ ఆ బాలిక పడుతున్న వేదన వర్ణనాతీతం. అమ్మ ఇక లేదన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేక, నాన్న చేసిన తప్పుకు అనాథగా మిగిలిపోయిన హర్షిత ను చూసి అద్దంకి పట్టణం చలించిపోయింది. ఇలాంటి కష్టం ఏ బిడ్డకూ రాకూడదని కోరుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.