Guntur: ఎంత పనిచేశావ్ అల్లుడా.. భార్య మీద కోపంతో అర్థరాత్రి ఇంట్లోకి దూరి..
గుంటూరు జిల్లాలో భార్యపై కోపంతో అల్లుడు అత్త ఇంట్లో బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. మద్యానికి, పేకాటకు బానిసైన గోపి, భార్య పుట్టింటికి వెళ్ళినా వేధించడం మానలేదు. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి 8 సవర్ల బంగారం, వెండి పట్టీలు దొంగిలించాడు. పోలీసులు సాంకేతిక ఆధారాలతో గోపిని పట్టుకొని, దొంగిలించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం గుండవరానికి చెందిన గోపికి.. వేజెండ్ల గ్రామానికి చెందిన తిరుపతమ్మకు పదిహేనేళ్ల క్రితమే పెళ్లైంది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. మద్యానికి, పేకాటకు బానిసైన గోపి భార్యతో తరుచూ గొడవపడుతున్నాడు. దీంతో ఆమె మూడు నెలల క్రితం పుట్టింటికి వచ్చి తల్లితో కలిసి జీవిస్తుంది. ఆమె పుట్టింటికి వచ్చినా గోపి వేధింపులు మాత్రం తగ్గలేదు. తరుచూ డబ్బుల కోసం భార్యను పీడించసాగాడు. అయితే, ఈ వివాదం ఇలా కొనసాగుతున్న సమయంలోనే తిరుపతమ్మ తల్లి బంగారు ఆభరణాల చోరి జరిగింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో గోపియే నిందితుడని తేల్చారు. అతని వద్ద నుండి ఆభరణలు రికవరీ చేశారు.
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడన్న సామెతను గుర్తుకు తెచ్చుకున్న గోపి పక్కా ప్లాన్ చేసి చోరీ చేశాడు. మద్యానికి, పేకాటకు తరుచూ డబ్బులు అవసరం కావడంతో తిరుపతమ్మ వద్దకు వెళ్లి డబ్బులు ఇవ్వాలని వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే తిరుపతమ్మ చెప్పా పెట్టకుండా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలోని బంధువుల ఇంటికి వెళ్లింది. అయితే నాలుగో తేదిన భార్య కోసం అత్త ఇంటికి వచ్చిన గోపికి ఎవరూ కనిపించకపోవడంతో అక్కడ నుండి మొదట వెళ్లి పోయాడు. తర్వాత అర్ధరాత్రి ఒక్కడే వచ్చి తలుపులు పగులగొట్టి లోపలకి వెళ్లాడు. బీరువా తాళాలు తీసి ఎనిమిది సవర్ల బంగారు ఆభరణాలు, వెండి పట్టీలు తీసుకొని దర్జాగా అక్కడ నుండి ఉడాయించాడు. తర్వాత రోజు ఇంటిలో దొంగతనం జరిగిందని తెలుసుకున్న తిరుపతమ్మ పోలీసులు ఫిర్యాదు చేసింది.
రంగంలోకి దిగిన పోలీసులు అనేక ఆధారాలు సేకరించిన తర్వాత గోపి నిందితుడిగా తేల్చి అతన్ని పట్టుకొని తమదైన శైలిలో విచారించారు. దీంతో గోపి తానే దొంగతనం చేసినట్లు ఒప్పుకొని బంగారు ఆభరణాలు తీసుకొచ్చి ఇచ్చాడు. దీంతో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
