Banakacharla Project: బనకచర్లకు వినియోగించేది వరద జలాలే… ఏపీ ప్రభుత్వానికి వాస్కోస్‌ నివేదిక

ఏపీ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై వాస్కోస్‌ నివేదిక ఇచ్చింది. బనకచర్లకు వినియోగించేది వరద జలాలేనని వాస్కోస్‌ నివేదికలో పేర్కొంది. 200 TMCలు గోదావరి వరద జలాలేనని నివేదిక ఇచ్చింది కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వాస్కోస్. నదీ జలాల కేటాయింపులు, ట్రిబ్యునల్‌ ఆదేశాలను...

Banakacharla Project: బనకచర్లకు వినియోగించేది వరద జలాలే...  ఏపీ ప్రభుత్వానికి వాస్కోస్‌ నివేదిక
Banakacharla Project

Updated on: Jul 11, 2025 | 8:01 AM

ఏపీ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై వాస్కోస్‌ నివేదిక ఇచ్చింది. బనకచర్లకు వినియోగించేది వరద జలాలేనని వాస్కోస్‌ నివేదికలో పేర్కొంది. 200 TMCలు గోదావరి వరద జలాలేనని నివేదిక ఇచ్చింది కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వాస్కోస్. నదీ జలాల కేటాయింపులు, ట్రిబ్యునల్‌ ఆదేశాలను పరిశీలించి సమగ్ర నివేదిక రూపొందించింది వ్యాప్కోస్. నేడు కేంద్రజలశక్తిశాఖ, CWCకి ఏపీ ప్రభుత్వం నివేదిక అందించనుంది. జూలై 14న బనకచర్లపై కేంద్రంతో ఏపీ సీఎం చంద్రబాబు చర్చించనున్నారు.

అయితే బనకచర్ల ప్రాజెక్ట్‌తో తమ రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందంటూ తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖకు చేసిన ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో పోలవరం – బనకచర్ల ప్రాజెక్ట్‌కు ప్రస్తుత దశలో పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్ట్‌పై పలు సందేహాలు ఉన్నాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో బనకచర్ల ప్రాజెక్ట్‌కు ఇప్పుడే అనుమతులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌పై ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్ర పర్యావరణ నిపుణుల మదింపు కమిటీ వెనక్కి పంపింది.

అంతే కాకుండా ఏపీ ప్రభుత్వానికి మూడు కీలక సూచనలు చేసింది.1. ప్రాజెక్టు ప్రతిపాదకులు (PP) కేంద్ర జల సంఘం (CWC) సహాయంతో వరద నీటి లభ్యతపై సమగ్ర అధ్యయనం చేయాలి. 2. గోదావరి నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ అవార్డ్1980కి విరుద్ధంగా ఉందన్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకోవాలి. 3. టెర్మ్స్‌ ఆఫ్‌ రెఫరెన్స్‌ (TOR) తయారీకి ముందు రాష్ట్రాల మధ్య జల పంపిణీపై క్లారిటీ కోసం కేంద్ర జల కమిషన్ అనుమతి తీసుకోవాలని కేంద్ర పర్యావరణ నిపుణుల మదింపు కమిటీ తెలిపింది.

సముద్రంలో కలిసే గోదావరి నది మిగుల జలాలను మళ్లించి.. రాయలసీమ జిల్లాలకు అందించాలని చంద్రబాబు ప్రభుత్వం భావించింది. అందుకోసం బనకచర్ల ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. అయితే ఏపీ చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల తమ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ తెలంగాణలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి పలువురి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంది. అనంతరం ఈ వ్యవహారంపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రితోపాటు పలు శాఖల మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సోదాహరణగా వివరించారు. దీంతో పోలవరం – బనకచర్ల ప్రాజెక్ట్‌కు ప్రస్తుత దశలో పర్యావరణ అనుమతులు ఇవ్వలేమని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ ఏపీ ప్రభుత్వానికి తెలిపింది.

అయితే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వాస్కోప్‌ బనకచర్ల ప్రాజెక్టు, నీటి లభ్యత తదితర అంశాల మీద సమగ్ర అధ్యయనం చేసింది. వాస్కోస్‌ నివేదిక అందజేసిన నేపథ్యంలో కేంద్రజలశక్తిశాఖ, CWC ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది.