ఏపీలో కుండపోత వర్షాలు బీభీత్సం సృష్టిస్తున్నాయ్. ఎక్కడికక్కడ వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయ్. ఏజెన్సీలో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలోకి వెళ్లిపోయాయి. ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో కొండవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొండవాగు ఉధృతికి బుట్టాయిగూడెం-జీలుగుమిల్లి రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహానికి కల్వర్టు సైతం కొట్టుకుపోయింది.
జల్లేరు వాగు ఉధృతికి జంగారెడ్డిగూడెం మండలం విలవిల్లాడుతోంది. 19 ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దాంతో, వరద బాధితులను సేఫ్గా ఆటోల్లో తరలిస్తున్నారు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లాలోనూ భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయ్. నిడదవోలు మండలం ఎర్ర కాలువ ఉప్పొంగి ప్రవహిస్తోంది. దాంతో అనేక గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయ్. భారీ వర్షాలు & వరదల కారణంగా తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లి జాతీయ రహదారి సమీపంలో SBI బ్యాంకులోకి వరద నీరు చేరింది బ్యాంకు లోపల సుమారు 3 అడుగుల నీరు చేరడంతో..ఖాతాదారులను బ్యాంకు సిబ్బంది బయటకు పంపారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
అల్లూరి జిల్లాలోనూ వరదలతో ఇబ్బందులు పడుతున్నారు జనం. ఆంధ్రా ఒడిశా జాతీయ రహదారి 326పైకి పెద్దఎత్తున వరద నీరు చేరుకుంది. దాంతో, చింతూరు-మోటు మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. వేలేరుపాడు మండలంలో కుండపోత వర్షాలకు మూగజీవాలు బలయ్యాయి. ఈదురుగాలులకు చెట్లు విరిగి పడ్డాయి. ఎన్టీఆర్ జిల్లాలో కట్టలేరు వాగు భయపెడుతోంది. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి కట్టలేరు ఉధృతంగా ప్రవహిస్తున్నది. వాగు ఉధృతి కారణంగా 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.