Vizag: శ్రీచరణ్లో ఓ మూర్ఖుడు కూడా ఉన్నాడు: తండ్రి దుర్గాప్రసాద్
విశాఖకు చెందిన టెకీ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతున్న వేళ ఇరు కుటుంబాల వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాధా గాయత్రి తండ్రి సుధాకర్ ఉత్తరాఖండ్లో పోరాటం కొనసాగిస్తున్నారు. .. ..

విశాఖకు చెందిన టెకీ రాధా గాయత్రి అనుమానాస్పద మృతి కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. తన కుమార్తె మృతిపై న్యాయం కోసం తండ్రి సుధాకర్ అలుపెరుగని పోరాటం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్లో ఉంటూ అధికారుల దృష్టికి ఈ కేసును తీసుకెళ్తూ న్యాయం కోసం ప్రయత్నిస్తున్నారు. రిషికేశ్లోని గంగా, యమునా, సరస్వతీ నదుల త్రివేణి సంగమం వద్ద రాధా గాయత్రి సంస్మరణ కార్యక్రమం నిర్వహించి, వైదిక పద్ధతుల్లో దశదిన కర్మలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రత్యేక పూజలు చేశారు.
ఇదిలా ఉండగా, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీచరణ్ తండ్రి దుర్గాప్రసాద్ టీవీ9తో మాట్లాడుతూ తన కుమారుడిని వెనకేసుకురావడానికి ప్రయత్నించలేదు. శ్రీచరణ్లో నిర్లక్ష్య స్వభావం ఉందని, ట్రాకర్ వ్యవహారంపై ఇంట్లో పలుమార్లు గొడవలు జరిగాయని, ఆ సమయంలో అతడి తల్లి కూడా కోపంతో చేయి చేసుకున్న విషయం నిజమేనని వెల్లడించారు. అయితే రాధా గాయత్రిని శ్రీచరణ్ హత్య చేశాడా లేదా అన్నది కోర్టులే తేల్చాల్సిన విషయమని వ్యాఖ్యానించారు.
దుర్గాప్రసాద్ వ్యాఖ్యలపై స్పందించిన రాధా గాయత్రి తండ్రి సుధాకర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తెను నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేశారని, శ్రీచరణ్ తన కూతురిని చంపి స్విచ్ ఆఫ్ చేసి తిరుగుతున్నాడని ఆరోపించారు. శ్రీచరణ్ చేసిన తప్పులను తన కుమార్తె ఎన్నోసార్లు భరించిందని, చివరకు అదే నమ్మకానికి ప్రాణాలతో మూల్యం చెల్లించాల్సి వచ్చిందన్నారు. తప్పు చేయకపోతే ఎదిగిన కొడుకుని తల్లి ఎందుకు కొడుతుందని ప్రశ్నించిన ఆయన, ఈ కేసులో పూర్తి నిజాలు బయటపెట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగా, నిజానిజాలు వెలుగులోకి రావాలని ఇరు కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
