
ఆంధ్రప్రదేశ్, ఆగస్టు 19: ఒకప్పుడు టీడీపీ కంచుకోట విజయనగరం జిల్లా. ప్రతీ ఎన్నికల్లో టీడీపీ ఇక్కడ తన హవా చాటుకుంటూ వస్తోంది. అలాంటి జిల్లాలో 2019 ఎన్నికల్లో సైకిల్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చింది వైసీపీ. ఇక్కడ ఫ్యాన్ వేవ్తో పాటు పార్టీపరమైన తప్పిదాలతో కోలుకోలేని దెబ్బతింది టీడీపీ. ఆ ఎన్నికల్లో తొమ్మిదికి తొమ్మిది అసెంబ్లీ సీట్లు, ఒక ఎంపీ సీటును కైవసం చేసుకుని విజయనగరాన్ని క్లీన్స్వీప్ చేసింది వైసీపీ. మంత్రి బొత్స, పార్టీ జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీనుల నాయకత్వంతో తర్వాత జిల్లాలో పార్టీ ఇంకా బలపడింది. దీంతో ఇప్పుడు టీడీపీ ఒకప్పటి తన కంచుకోటపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వెళ్లాలన్న ఆలోచనతో ఉంది విపక్షపార్టీ.
విజయనగరం జిల్లాలోని నియోజకవర్గాల ఇంచార్జిల పనితీరుని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కాస్త గట్టిగానే వ్యవహరిస్తోంది టీడీపీ. కాపు, కొప్పల వెలమలు అధికంగా ఉండే జిల్లాలో ఈసారి కొప్పల వెలమ సామాజికవర్గానికి రెండు సీట్లు ఇచ్చేలా వర్కవుట్ చేస్తోంది. అలాగే జిల్లాలో బొత్స కుటుంబాన్ని సమర్థంగా ఢీకొట్టగల బలమైన నాయకుడిని విజయనగరం పార్లమెంట్ స్థానంనుంచి పోటీకి దించాలనుకుంటోందట టీడీపీ. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని ఈసారి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టొచ్చన్న ప్రచారం బలంగా జరుగుతోంది. రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలు రచించడంలో గంటాకు ప్రత్యేక ముద్ర ఉంది. అంగ, అర్ధబలమున్న నేత కావడంతో జిల్లాలో పార్టీకేడర్కి గంటా అభ్యర్థిత్వం ఒక బూస్ట్లా ఉంటుందన్న వ్యూహంతో ఆ దిశగా అడుగులేస్తోందట టీడీపీ.
ఓటమి ఎరుగని నాయకుడిగా గంటాకు గుర్తింపు ఉంది. పైగా ఆయన కాపు సామాజికవర్గ నేత కావడంతో ఆ వర్గం ఎక్కువగా ఉన్న విజయనగరంలో సామాజిక సమీకరణాలు కూడా కలిసొస్తాయని డిసైడ్ అయిందట టీడీపీ నాయకత్వం. పార్టీ అంతర్గత సర్వేల్లోనూ గంటా అభ్యర్థిత్వానికి ఎక్కువమంది మొగ్గుచూపినట్లు టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. దీంతో విజయనగరం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా గంటా పేరు దాదాపు ఖరారైనట్లే భావిస్తున్నారు. అంతా బానే ఉన్నా.. జిల్లా తెలుగుదేశం సుప్రీం అశోక్ గజపతి రాజు… గంటాని అంగీకరిస్తారా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. గత టీడీపీ ప్రభుత్వంలో గంటా శ్రీనివాసరావు జిల్లా ఇంచార్జి మంత్రిగా ఉన్నప్పుడు అశోక్ గజపతితో కొంత గ్యాప్ నడిచింది. దీంతో గంటా అభ్యర్థిత్వానికి సీనియర్ ఎంతవరకు మద్దతిస్తారన్న అనుమానం కొందరికుంది.
గంటా వర్గంగా పేరున్న మాజీ ఎమ్మెల్యేలు కేఏ నాయుడు, మీసాల గీత విజయనగరం జిల్లాలో అశోక్గజపతిరాజు వ్యతిరేకవర్గంగా ఉన్నారు. అంతేకాకుండా గతంలో రెండుసార్లు ఎంపీగా పోటీచేసి, కేంద్రమంత్రిగా కూడా కీలక బాధ్యతలు చేపట్టిన అశోక్గజపతిరాజు ఈసారి ఎంపీగా పోటీచేస్తానని పట్టుబడితే పరిస్థితేంటన్నది మరో ప్రశ్న. ఇలా అనేక రాజకీయ సమీకరణాల మధ్య గంటా జిల్లాకొస్తే అశోక్గజపతి ఎలా స్పందిస్తారన్నది పార్టీ శ్రేణుల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే ఎలాగైనా జిల్లాలో పార్టీని బలంగా తయారు చేయాలన్న పట్టుదలతో ఉన్న అధిష్ఠానం అశోక్ గజపతికి సర్దిచెబుతుందా? లేదంటే ఇద్దరి మధ్యా సయోధ్య కుదిర్చి జిల్లాలో వైసీపీకి చెక్ పెడుతుందో చూడాలి. మొత్తానికైతే విజయనగరం పాలిటిక్స్లోకి గంటా ఎంట్రీ ఇస్తున్నారన్న టాక్ అయితే బలంగానే ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..