Andhra: ఐస్ క్రీం తిన్నా, అమ్మినా జరిమానా కట్టాల్సిందే.. పిల్లల కోసం గ్రామస్తుల సంచలన నిర్ణయం..
గ్రామంలో ఎవరైనా ఐస్ క్రీం బండ్లతో వచ్చి.. ఐస్ క్రీం అమ్మితే వారికి 3,000 రూపాయల జరిమానా విధిస్తారు. ఒకవేళ నిబంధనలు అతిక్రమించి ఎవరైనా ఐస్ క్రీమ్ కొని తింటే వారికి 1,000 రూపాయల జరిమానా విధిస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు. రంగు రంగుల నీళ్లను ప్లాస్టిక్ కవర్లో పోసి, ప్యాక్ చేసి గడ్డకట్టించి వాటిని విచ్చల వడిగా అమ్మేస్తుంటారు.

సాధారణంగా వేసవి కాలం వచ్చిందంటే ఐస్ క్రీం బండ్ల సందడి కనిపిస్తుంది. సెలవులు కావటం, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఎక్కువగా కూల్ డ్రింక్స్, ఐస్ క్రీములు తింటారు. కానీ, అలా తిన్నా అమ్మినా నేరమే అంటున్నారు అక్కడి ప్రజలు.. ఒకవేళ అమ్మినా.. కొన్నా.. జరిమానా కట్టాల్సిందేనంటూ పోస్టర్లు ఏర్పాటు చేశారు.. ఈ నిభందన ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన కుక్కునూరు మండలం నేమిలిపేట గ్రామంలో మొదలైంది. తమ పిల్లల ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్త వహిస్తూ, గ్రామస్తులందరూ కలిసి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ఐస్ క్రీం అమ్మకాలను, వినియోగించడంపై పూర్తిగా నిషేధిస్తూ వినూత్నంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల ప్రకారం గ్రామంలో ఎవరైనా ఐస్ క్రీం బండ్లతో వచ్చి.. ఐస్ క్రీం అమ్మితే వారికి 3,000 రూపాయల జరిమానా విధిస్తారు. ఒకవేళ నిబంధనలు అతిక్రమించి ఎవరైనా ఐస్ క్రీమ్ కొని తింటే వారికి 1,000 రూపాయల జరిమానా విధిస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు. రంగు రంగుల నీళ్లను ప్లాస్టిక్ కవర్లో పోసి, ప్యాక్ చేసి గడ్డకట్టించి వాటిని విచ్చల వడిగా అమ్మేస్తుంటారు. అయితే.. సరైన విధంగా ప్రమాణాలు పాటించకపోవతంతో చిన్నారుల్లో జిర్ణకోశ సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంటున్నారు. దీంతో పాటు ఐస్ క్రీం తినడం వల్ల పిల్లలకు తలనొప్పి, దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులతో పాటు, వాటిలో కలిపే రంగులు, రసాయనాల వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ వంటి ప్రమాదకర జబ్బులు వచ్చే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అందుకే ముందస్తు జాగ్రత్తగా, పిల్లలను ఆరోగ్యంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వారు చెబుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఒక చిన్న గ్రామం తమ పిల్లల ఆరోగ్యం కోసం ఇలాంటి ఐక్యమత్యాన్ని చాటడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. “డబ్బు కంటే ఆరోగ్యమే ముఖ్యం” అని చాటిచెబుతున్న నేమిలిపేట గ్రామస్తుల నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ, వారి సామాజిక బాధ్యతను పలువురు అభినందిస్తున్నారు.
వీడియో చూడండి..
సిటీలలో ఉండేవాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఆరోగ్యం పట్ల అవగాహన ఉన్నా పిల్లలు మారం చేస్తున్నారని అడిగినదల్లా కొనిస్తుంటారు. కానీ, ఏజెన్సీలో మొదలైన మార్పు అన్ని ప్రాంతాలకు పాకితే మంచిదని పలువురు పేర్కొంటుండం చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
